ముదురుతున్న వివాదం
ABN, First Publish Date - 2020-11-11T04:42:08+05:30
మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశం రోజురోజుకూ బిగుసుకుంటోంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ద్వారా వచ్చిన జీవోను బయటపెట్టాలి లేదా ప్రవేశాలు చేపట్టాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సంకట స్థితిలో మాన్సాస్ యాజమాన్యం.. ప్రభుత్వం
వరుస ఆందోళనతో అట్టుడుకుతున్న విజయనగరం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశం రోజురోజుకూ బిగుసుకుంటోంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ద్వారా వచ్చిన జీవోను బయటపెట్టాలి లేదా ప్రవేశాలు చేపట్టాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఎం చేయాలతో తోచని పరిస్థితిలో ఇటు మాన్సాస్ యాజమాన్యం.. అటు ప్రభుత్వం ఉంది. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణను అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిసున్నారు. దీనిపై టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కూడా పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రౌండ్టేబుల్ సమావేశాల ద్వారా మాన్సాస్ నిర్ణయాలను ఎండగడుతున్నారు. అయినప్పటికీ ఇటు చైర్పర్సన్ గాని అటు మాన్సాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కాని పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం తెరచాటున సహకరించడమేనన్నది బహిరంగ ఆరోపణ. మాన్సాస్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉండగా మహారాజా కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నట్టా లేదా అన్నది మేనేజ్మెంట్ కాని ప్రిన్సిపాల్ కాని స్పష్టత ఇవ్వడం లేదు. మరో వైపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మహారాజ కళాశాలలో ఎయిడెడ్ను ఎత్తివేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే అన్ ఎయిడెడ్ విద్యా సంస్థగా నడిపే ఆలోచన ఉందా లేదా పూర్తిగా కళాశాలనే లేకుండా చేసే పన్నాగమా అన్నది ప్రవేశాల అధారంగా బయటపడుతుంది. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి యాజమాన్యం కాని, అటు ప్రభుత్వం కాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే కళాశాలను ప్రైవేట్ పరం చేసి భారీగా ఫీజులు వసూలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
Updated Date - 2020-11-11T04:42:08+05:30 IST