పెంపుడు జంతువులపై శ్రద్ధ చూపాలి: కలెక్టర్
ABN, First Publish Date - 2020-07-06T10:12:29+05:30
పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు.
విజయనగరం రింగురోడ్డు, జూలై 5: పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. వాటి నుంచి యాజమానులు, ఇతర వ్యక్తులకు వ్యాధులు సంక్రమించకుండా చూడాలన్నారు. సోమవారం వరల్డ్ జూనోసిస్ డే (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల నివారణ దినం) సందర్భంగా పశు సంవర్థక శాఖ రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పెంపుడు జంతువుల నుంచి మనుషులు సంక్రమించే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వీటికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. జూనోసిస్ డే పురస్కరించుకుని సోమవారం బహుళార్థక పశు వైద్య కేంద్రం (కోట వెనుక) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉచితంగా టీకాలు వేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎంవీ నర్సింహులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-07-06T10:12:29+05:30 IST