‘నాడు-నేడు’కు గ్రహణం
ABN, First Publish Date - 2020-10-03T09:03:14+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మన బడి నాడు-నేడు’ పథకం పనులు సిమెంట్ కొరతతో నిలిచిపోయాయి.
సిమెంట్ కొరతతో పాఠశాలల్లో ఆగిన పనులు
40 రోజుల నుంచి సరఫరా నిలిపివేసిన కంపెనీలు
జిల్లాలో రూ.2 కోట్ల వరకు బకాయిలు...చెల్లిస్తేనే సరఫరా చేస్తామని విస్పష్టం
పనులు పూర్తిచేయాలంటే మరో 1,700 టన్నుల సిమెంట్ అవసరమంటున్న అధికారులు
కూలి పనులు, మెటీరియల్ బిల్లులు రూ.30 కోట్లు పెండింగ్
డబ్బు కోసం తాపీ మేస్ర్తీలు, సామగ్రి సరఫరాదారుల ఒత్తిళ్లు
మానసిక ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మన బడి నాడు-నేడు’ పథకం పనులు సిమెంట్ కొరతతో నిలిచిపోయాయి. బహిరంగ మార్కెట్ కంటే 60 శాతం తక్కువ ధరకు సరఫరా చేస్తున్నప్పటికీ, బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం అవుతున్నదని, అందువల్ల సిమెంట్ సరఫరా చేయలేమని కంపెనీలు చేతులెత్తేశాయి. 40 రోజుల నుంచి సిమెంట్ సరఫరా కావడం లేదు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశించడం, మరోవైపు సిమెంట్ సరఫరా కాకపోవడం, ఇతర పనులకు సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులకు ఏం చేయాలో పాలుపోక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
జిల్లాలో ‘మన బడి నాడు-నేడు’ పథకం కింద తొలివిడత 1,149 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.300 కోట్లతో ఏడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్ రెండో వారం) నాటికి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మార్చి నెలాఖరు నుంచి కరోనా వైరస్ వ్యాప్తిచెందడం, లాక్డౌన్ కారణంగా కొన్నిచోట్ల పనులు ఆగిపోగా, అత్యధిక పాఠశాలల్లో పనులు అసలు ప్రారంభం కాలేదు. దీంతో పనులు పూర్తిచేసే గడువును జూలైకు...మళ్లీ ఆగస్టు చివరికి పొడిగించుకుంటూ వచ్చారు. అయినప్పటికీ నిధుల కొరత, మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, వర్షాల కారణంగా అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడిగించారు. అయినా సరే పనుల్లో పురోగతి లేదు.
బిల్లులు పెండింగ్...సిమెంట్ సరఫరా బంద్
పాఠశాలల్లో నాడు-నేడు పనులు మందకొడిగా సాగడానికి పలు కారణాలు వున్నాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఏ పనికైనా సిమెంట్ ముఖ్యమని, సుమారు నెలన్నర నుంచి సిమెంట్ సరఫరా కావడం లేదని వారు చెబుతున్నారు. పెండింగ్లో వున్న పనులన్నీ పూర్తి చేయాలంటే మరో 1,700 టన్నుల సిమెంట్ అవసరమని విద్యా శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాకు ఇంతవరకు రూ.6 కోట్ల విలువ చేసే సిమెంట్ సరఫరా చేయగా, దీనిలో రూ.4 కోట్ల బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయని, ఇంకా రూ.2 కోట్లు బకాయి వుందని కంపెనీలు చెబుతున్నాయి.
విశాఖ జిల్లా వరకు బకాయి తక్కువేనని, మిగిలిన జిల్లాల్లో ఎక్కువ బిల్లులు పెండింగ్లో వున్నాయని, అందువల్లనే సరఫరా ఆపేశామని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేసినట్టు తెలిసింది. బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ రూ.400 కంటే ఎక్కువ ధర వుందని, ప్రభుత్వ పనుల కోసం బస్తా రూ.235కే సరఫరా చేస్తున్నామని, అయినప్పటికీ బిల్లుల మంజూరులో తీవ్రజాప్యం జరుగుతున్నదని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
దీంతో 40 రోజుల నుంచి సిమెంట్ సరఫరాను నిలిపివేశాయి. మరోవైపు ఇతర కూలి పనులు, నిర్మాణ సామగ్రికి సంబంధించి జిల్లాకు రూ.30 కోట్లు విడుదల కావాల్సి వుందని, ఆయా తాపీ మేస్ర్తీలు, మెటీరియల్ సరఫరాదారులు డబ్బుల కోసం తమను ఒత్తిడి చేస్తున్నారని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెబుతున్నారు.
ఏ పని..ఎంతవరకు....
జిల్లాలో ‘నాడు-నేడు’ పనులను 1,149 పాఠశాలల్లో చేపట్టాలని నిర్ణయించారు. వీటిల్లో 1,128 పాఠశాలల్లో మేజర్, మైనర్ పనులు ప్రారంభించారు. ఇంతవరకు వంద శాతం పనులు పూర్తయిన పాఠశాలలు పట్టుమని పది కూడా లేవు. 1,018 పాఠశాలల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకం నిధులతో 43 పాఠశాలల్లో ప్రహరీ గోడలు నిర్మించాల్సి వుండగా 28 పాఠశాలల్లో పూర్తిచేశారు. 1,093 పాఠశాలల్లో తాగునీటి పనులు చేయాల్సి వుండగా 911 పాఠశాలల్లో పూర్తయ్యాయి.
విద్యుదీకరణకు సంబంధించి 1,128 పాఠశాలలకుగాను 745 పాఠశాలల్లో వైరింగ్ పని పూర్తిచేసి ట్యూబ్లైట్లు బిగించారు. 1,131 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు/మరమ్మతులు చేయాల్సి ఉండగా 1,091 పాఠశాలల్లో 74 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తిచేశారు. సిమెంట్, ఇసుక సరఫరాతోపాటు అమరావతి నుంచి ఫ్యాన్లు, డెస్కులు, గ్రీన్ బోర్డులు, టాయ్లెట్ బేసిన్లు, కంప్యూటర్లు వంటి సామగ్రిని సత్వరం పంపితేనే ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయని ప్రధానోఽపాధ్యాయులు చెబుతున్నారు. నవంబరు ఐదు నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరుకు పనులు చేయాలని ఆదేశించడంతో ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
నెలాఖరులోగా పనులు పూర్తిచేస్తాం
ఎం.మల్లికార్జునరెడ్డి, ఏపీసీ, సమగ్ర శిక్షా అభియాన్
పాఠశాలల్లో నాడు-నేడు పనులు 70 నుంచి 80 శాతం వరకు పూర్తిచేశాం. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సిమెంట్ కొరత వల్ల పనులు మందగించాయి. సిమెంట్ సరఫరాతోపాటు అమరావతి నుంచి సామగ్రి వస్తే ఈ నెలాఖరుకు పనులన్నీ పూర్తిచేస్తాం.
Updated Date - 2020-10-03T09:03:14+05:30 IST