కేంద్రం అనుమతిస్తేనే పర్యాటకం
ABN, First Publish Date - 2020-08-05T10:30:36+05:30
కేంద్ర ప్రభుత్వం కరోనా అన్లాక్లో భాగంగా సడలింపులు ఇచ్చాకే పర్యాటక ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు ..
బొర్రా గుహలను నెలాఖరు వరకు తెరవొద్దని స్థానిక గిరిజన సంఘం తీర్మానం
విశాఖలో బోటింగ్కు నెలాఖరు వరకు అవకాశం లేనట్టే
పార్కుల్లో కూడా ఇదే పరిస్థితి
పర్యాటక హోటళ్లలో 35 శాతం రాయితీ
ఏపీటీడీసీ డీవీఎం ప్రసాదరెడ్డి
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం కరోనా అన్లాక్లో భాగంగా సడలింపులు ఇచ్చాకే పర్యాటక ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, బీచ్లో పర్యాటక కార్యక్రమాలకు అనుమతులు రాలేదని, అలాగో బోటింగ్కు కూడా అనుమతించలేదని స్పష్టం చేశారు.
బొర్రాలో అన్నీ అనుకూలించాకే...
బొర్రా గుహలకు పర్యాటకులను అనుమతించాలని విజ్ఞప్తులు వస్తున్నా... ఇప్పటివరకు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రసాదరెడ్డి తెలిపారు. అరకులోయ, పాడేరుల్లో సంపూర్ణ లాక్డౌన్కు అక్కడి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. అలాగే ఆగస్టు 31వ తేదీ వరకు బొర్రా గుహలను తెరవ వద్దని స్థానిక గిరిజన సంఘాలు, పంచాయతీ తీర్మానం చేశాయని, ఆ కాపీని తమకు కూడా పంపాయన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున బొర్రా గుహలను తెరవడం లేదని స్పష్టంచేశారు.
పర్యాటక హోటళ్లలో 35 శాతం రాయితీ
కరోనా నేపథ్యంలో పర్యాటకులు తగ్గినందున ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి జిల్లాలో తమ సంస్థకు చెందిన అన్ని హోటళ్లు, అతిథిగృహాల్లో 35 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రసాదరెడ్డి వెల్లడించారు. విశాఖగరంలో అప్పుఘర్, రుషికొండ, ఏజెన్సీలో అనంతగిరి, అరకులోయల్లో సంస్థకు హోటళ్లు, రిసార్టులు ఉన్నాయన్నారు.
Updated Date - 2020-08-05T10:30:36+05:30 IST