వ్యాధులపై అప్రమత్తం
ABN, First Publish Date - 2020-06-04T09:07:30+05:30
ఉత్తరాంధ్రలోని గిరిజన పల్లెల్లో వ్యాధులు విజృంభించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, రోగాల కారణంగా ఏ ఒక్కరూ ..
గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టండి
రోగాలతో ఒక్కరు కూడా చనిపోకూడదు
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని
ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై సమీక్ష
పాడేరు జూన్ 3: ఉత్తరాంధ్రలోని గిరిజన పల్లెల్లో వ్యాధులు విజృంభించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, రోగాల కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదని, ఈ మేరకు అధికార యం త్రాంగం అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ, వాతావరణం మారుతున్న తరుణంలో గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా పాడేరుకి మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడం వైద్య సేవలకు ప్రతికూలంగా వున్నట్టు గుర్తించామన్నారు. అన్ని పల్లెలకు రోడ్లు నిర్మించడానికి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో చర్చిస్తామన్నారు. ఏజెన్సీలో అవసరమైన చోట కొత్త పీహెచ్సీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఆస్పత్రుల స్థితిగతులను డీఎంహెచ్వోలు, ఐటీడీఏ పీవోలను అడిగి తెలుసుకున్నారు. జూలై నుంచి ఆస్పత్రులకు అంబులెన్సుల కొరత ఉండబోదన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షిత తాగునీటి కోసం ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్ల డించారు. ఈ సమావేశంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, గొల్ల బాబూరావు, వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-04T09:07:30+05:30 IST