పెళ్లి సందడి
ABN, First Publish Date - 2020-10-30T00:51:38+05:30
ఈ నెల 17 నుంచి ప్రారంభం వచ్చే నెలలో నాలుగు రోజులు మినహా జనవరి 14 వరకూ ముహూర్తాలు గడచిన రెండు రోజుల్లో సింహగిరిపైన, కొండ దిగువన వందలాది వివాహాలు
సింహాచలం, అక్టోబరు 29: ఆరు మాసాలుగా నిలిచిన శుభకార్యాలు...నిజఆశ్వీయుజమాస శుక్ల పక్షం ప్రారంభంతో అంటే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సింహగిరిపైన, కొండ దిగువన దేవస్థానం, ప్రైవేటు కల్యాణ మండపాల్లో సుమారు వందకుపైగా పెళ్లిళ్లు జరిగాయి. నూతన వధూవరులంతా అప్పన్నను దర్శించుకోవడానికి రావడంతో సింహగిరిపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సందడి వాతావరణం నెలకొంది. సాధారణంగా ఉగాది, చైత్రమాసం ప్రారంభం నుంచి వైశాఖ, జేష్ట, శ్రావణ, ఆశ్వీయుజ మాసాలలో పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో మార్చి 20 నుంచి లాక్డౌన్ ప్రారంభం కావడంతో పెళ్లిళ్లకు బ్రేకులు పడ్డాయి. ఏప్రిల్, మే, ఆగస్టు నెలల్లో జరగాల్సిన వందలాది పెళ్లిళ్లను నిర్వాహకులు వాయిదా వేసుకున్నారు. అధిక ఆశ్వీయుజమాసం కావడంతో సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 16 వరకు కూడా ముహూర్తాలు లేని కారణంగా పెళ్లిళ్లు జరగలేదు. నిజ ఆశ్వీయుజమాసం ఈ నెల 17 నుంచి అంటే శరన్నవరాత్రులు ప్రారంభం నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. వచ్చే నెలలో నాలుగు రోజులు (12 నుంచి 15 వరకు) మళ్లీ ముహూర్తాలు లేవు. ఆ తర్వాత నవంబరు 16 పవిత్ర కార్తీక మాసం ప్రారంభం నుంచి పుష్య మాసం ప్రారంభం వరకు అంటే 2021 జనవరి 14 వరకు శుభముహూర్తాలు వున్నట్టు పంచాంగాలను బట్టి తెలుస్తోంది.
Updated Date - 2020-10-30T00:51:38+05:30 IST