పెనుప్రమాద ముప్పును గుట్టుగా ఉంచి.. ఊళ్ల నుంచి వెళ్లిపోండని ప్రచారం..!
ABN, First Publish Date - 2020-05-09T07:14:26+05:30
విశాఖపట్నం ప్రజల ప్రాణాలతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చెలగాటమాడుతోంది
క్యా ‘ఎల్ ’జీ!?
ప్రజల ప్రాణాలతో ‘పాలిమర్స్’ చెలగాటం
దఫదఫాలుగా లీకవుతున్న గ్యాస్
గురువారం రాత్రి ట్యాంకు వద్ద భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు
400 డిగ్రీలు నమోదైనట్టు సమాచారం
అప్పటికప్పుడు ఊళ్లు ఖాళీ చేయాలని ప్రచారం
వేలాది మంది రోడ్లపైకి రావడంతో రంగంలోకి పోలీసులు
ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాని వైనం
అంతా సర్దుకుందని ప్రజా ప్రతినిధుల ప్రకటనతో తిరిగి ఇళ్లకు
పరిస్థితి 60 శాతం అదుపులోకి వచ్చిందని కలెక్టర్ నివేదిక
మరో 24 గంటల్లో మిగిలిన 40 శాతం కూడా...
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): విశాఖపట్నం ప్రజల ప్రాణాలతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చెలగాటమాడుతోంది. అంత పెద్ద ప్రమాదం జరిగినా అధికార యంత్రాంగానికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. బాధితుల్లో ఓ యువకుడు ‘చచ్చిపోతున్నాం’ అంటూ ఫోన్ చేస్తేనే పోలీసులకు తెలిసింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయి, వేయి మందికిపైగా అస్వస్థతకు గురైనా కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం వీడలేదు. వాస్తవాలు బయటపెట్టడం లేదు.
స్టైరిన్ విషవాయువు లీక్ను అరికట్టడానికి కంపెనీ గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో బీటీసీటీ పదార్థం 500 కిలోలు తెప్పించింది. అయితే అది విశాఖకు చేరక ముందే స్టైరిన్ ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. విశ్వసనీయ సమాచారం మేరకు...400 డిగ్రీల సెల్సియస్కు చేరింది. అటువంటి సమయంలో ట్యాంకు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అదే గనుక జరిగితే చుట్టుపక్కల తీవ్ర విధ్వంసం జరుగుతుంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పి తగిన సలహా తీసుకోవలసిన సిబ్బంది...గుట్టుగా ఉంచి..వారి మనుషులతో పరిసర ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని రాత్రి పది గంటల ప్రాంతంలో ప్రచారం చేయించారు.
దాంతో వేపగుంట, సుజాతనగర్, జుత్తాడ, సింహాచలం, ఎన్ఏడీ, మర్రిపాలెం తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది అప్పటికప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. నడుచుకుంటూనే అటు గాజువాక, కొత్తవలస, ఇటు విశాఖపట్నం బీచ్కు చేరుకున్నారు. రోడ్లపై జనాలు ఎందుకు అంత పెద్ద సంఖ్యలో వస్తున్నారో అర్థం కాని పోలీసులు... విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేక వాహనాలను ఆయా ప్రాంతాలకు పంపించి, ఎటువంటి ప్రమాదం లేదని, ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లల్లోనే వుండాలని ప్రచారం చేశారు. అయినా ప్రజలు ఆగలేదు.
ప్రాణభయంతో రాత్రి అంతా నడుస్తూనే ఉన్నారు. అయితే ట్యాంకరు పేలిపోతుందనే భయంతో ఉష్ణోగ్రతలు ఎలాగైనా తగ్గించాలని కంపెనీ సిబ్బంది యత్నించారు. చివరకు ఢిల్లీ నుంచి వచ్చిన పదార్థం వాడకుండానే తీవ్రత తగ్గించగలిగారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయానికి ఉష్ణోగ్రతలు 60 శాతం తగ్గించారు. కొంత నియంత్రణలోకి తెచ్చారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు మళ్లీ పరిశ్రమకు వెళ్లి అంతా బాగానే ఉందని ప్రకటించాక..నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.
రూమర్లు అంటూ కొట్టివేత
అధికారులు, నాయకులు...గురువారం రాత్రి కొందరు సోషల్ మీడియా ద్వారా కావాలనే రూమర్లు వ్యాపింపజేశారని, ఎటువంటి భయం లేదని, అంతా సర్దుకుందని శుక్రవారం అధికారులు, నాయకులు ప్రకటించారు. అయితే ఓ ప్రజాప్రతినిధి మాత్రం...రాత్రి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడబట్టే.. ప్రజలకు నష్టం జరగకూడదని..ఖాళీ చేయించామని సెలవిచ్చారు.
60 శాతం అదుపులోకి... కలెక్టర్ నివేదిక
స్థానిక ప్రజాప్రతినిధి, మంత్రులు సహా అంతా అదుపులోనే వుందని చెబుతుండగా, కలెక్టర్ వినయ్చంద్ మాత్రం సీఎంకు సమర్పించిన నివేదికలో 60 శాతమే నియంత్రించగలిగామని, ఇంకో 24 గంటలు ఆగితే మిగిలిన 40 శాతం అదుపులోకి తెస్తామని చెప్పడం గమనార్హం. ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నా ఎల్జీ పాలిమర్స్ నోరు తెరిచి ఏమి జరిగిందో చెప్పడం లేదు. ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంది.
Updated Date - 2020-05-09T07:14:26+05:30 IST