కరోనా వైరస్పై కేంద్రం అప్రమత్తం
ABN, First Publish Date - 2020-03-16T06:42:48+05:30
కరోనాపై రాష్ట్రంలో హై అలెర్ట్ నెలకొంది. కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ
వలంటీర్లు, ఆశాలు, ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే
జిల్లాలో 12.5 లక్షల ఇళ్లు.. 60 శాతం సర్వే పూర్తి
విదేశీ ప్రయాణికులకు తనిఖీలు
అనుమానితులు క్వారంటైన్ సెంటర్లకు వెళ్లేలా ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనాపై రాష్ట్రంలో హై అలెర్ట్ నెలకొంది. కరోనా వైరస్ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తితో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరోనా వైరస్ గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు పలు విషయాలను సేకరించనున్నారు. ఈ సర్వే కోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను వినియోగిస్తున్నారు.
జిల్లాలో 12.50 లక్షల కుటుంబాలకు సర్వే చేయాల్సి ఉండగా, సమారు 60 శాతం వరకు సర్వే పూర్తయింది. మిగిలిన 40 శాతం సర్వే రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్వేలో భాగంగా విదేశాలకు వెళ్లారా? లేదా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటే వలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లో కరోనా వైరస్ అనే కంటెంట్లో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాలకు వెళితే ఎన్ని రోజులు అవుతుంది, జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నాయా, ఉంటే ఎన్ని రోజులు నుంచి ఉన్నాయి వంటి వివరాలను తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించనున్నారు.
విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి ప్రయాణికులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రయాణికులు రాకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇష్టమున్నా, లేకపోయినా విదేశాల నుంచి వస్తే మాత్రం తప్పనిసరిగా క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. అయితే, వీలైనంత వరకు విదేశాల నుంచి ప్రయాణికులు రాకుండా చూడాలని ఆయా దేశాల్లోని అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని అందించిందని తెలిసింది.
శాఖలకు బాధ్యతలు..
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు అప్పగించింది. వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి మిగిలిన శాఖలు తమ పరిధిలో ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కలిగించాలని సూచించింది. వీలైనంత వరకు ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకుండా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - 2020-03-16T06:42:48+05:30 IST