జాలరిపేటలో జీవీఎంసీ కమిషనర్ పర్యటన
ABN, First Publish Date - 2020-05-27T09:13:28+05:30
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన స్వయంగా మైక్ పట్టుకుని ..
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన స్వయంగా మైక్ పట్టుకుని ప్రచారం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె 22వ వార్డు పరిధి జాలరిపేటలోని కంటెయిన్మెంట్ జోన్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోకుండా వీధుల్లో తిరగడం చూసి ఆమె అవాక్కయ్యారు.
స్వయంగా మైక్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా వీధుల్లో తిరగడం ప్రాణాంతకమవుతుందని వివరించారు. ప్రజలకు కావలసిన సరుకులు, మందులు వంటి వాటిని అవసరమైతే ఇంటికి డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. కంటెయిన్మెంట్జోన్లో బారికేడ్లు పెంచాలని పోలీసులను సూచించారు. పారిశుధ్య నిర్వహణ, క్రిమిసంహారక మందుల పిచికారీ విధిగా జరగాలని జోన్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ సోమన్నారాయణ, జడ్సీ-3 వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-27T09:13:28+05:30 IST