750 కిలోల గంజాయి పట్టివేత
ABN, First Publish Date - 2020-11-04T04:50:59+05:30
ఒడిశా నుంచి బిహార్కు మినీ లారీలో తరలిస్తున్న 750 కిలోల గంజాయిని అరకులోయ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
చిలకడదుంపల మాటున రవాణా
ఇద్దరి అరెస్టు, మినీ లారీ సీజ్
అరకులోయ, నవంబరు 3: ఒడిశా నుంచి బిహార్కు మినీ లారీలో తరలిస్తున్న 750 కిలోల గంజాయిని అరకులోయ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ పైడయ్య తెలిపిన సమాచారం...
అరకులోయ ఎస్ఐ జోగారావు, పోలీసు సిబ్బంది మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో నాగాలాండ్ రాష్ట్ర రిజిస్ర్టేషన్తో చిలకడదుంపల తోడుతో మినీ లారీ వచ్చింది. పోలీసులు దీనిని ఆపి తనిఖీ చేశారు. చిలకడదుంపల మధ్యలో గంజాయి నింపిన 25 గోనె సంచులు కనిపించాయి. వీటిలో 750 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వాహనం ఒడిశాలోని మండి గ్రామం నుంచి బిహార్ వెళుతున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి మినీ లారీ డ్రైవర్ రాహుల్కుమార్ మిశ్రా, క్లీనర్ రాజేశ్ పాశ్వాన్లను అరెస్ట్ చేశారు. వాహనాన్ని, గంజాయిని సీజ్ చేశారు. బిహార్కు చెందిన మినీలారీ యజమాని సోనీకుమార్ ఠాగూర్పైనా కేసు నమోదు చేశారు. గంజాయిని రూ.15 లక్షలకు కొనుగోలు చేసినట్టు నిందితులు చెప్పారని, ఇది బిహార్లో రూ.75 లక్షల విలువ చేస్తుందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
Updated Date - 2020-11-04T04:50:59+05:30 IST