తగ్గుతున్న ప్రయాణాలు!
ABN, First Publish Date - 2020-07-09T12:29:46+05:30
తగ్గుతున్న ప్రయాణాలు!
‘ఆర్టీసీ’లోఫిఫ్టీ - ఫిఫ్టీ
రీజియన్లో 400 నుంచి 200కు తగ్గిన సర్వీసులు
విశాఖకు మొదట్లో పోటెత్తినా నేడు కానరాని రద్దీ
రోజుకు 50 నుంచి 30కి తగ్గిన బస్సులు
పల్లె వెలుగు బస్సుల్లోనూ అరడజనులోపే ప్రయాణికులు
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటంతో అత్యవసరాలకు తప్పితే ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ ప్రభావం ఆర్టీసీ మీద ప్రత్యక్షంగా చూపిస్తున్నా రైల్వే, విమానాలపై అంతగా చూపించ టం లేదు. ఐతే రానున్న రోజుల్లో వాటిపైనా కనిపించే అవకాశాలున్నాయి.
విజయవాడ: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. బస్స్టేషన్లు కళ తప్పుతున్నాయి. ప్రధాన బస్స్టేషన్లలోనూ రద్దీ తగ్గిపోయింది! ఆక్యుపెన్సీ సగానికి సగం పడిపోయింది! పల్లె వెలుగు బస్సుల్లోనే కాదు! దూర ప్రాంత బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. బస్సులూ తగ్గిపోయాయి! ఇదీ.. ఆర్టీసీ కృష్ణా రీజియన్లోని పరిస్థితి! రెండు నెలల లాక్డౌన్ తరువాత మొదటిసారిగా 102 బస్సులతో రోడ్డు రవాణా సంస్థ కృష్ణా రీజియన్ పరిధిలో బస్సులు నడిపారు. అప్పట్లో ప్రయాణాలు ఊహించని విధంగా సాగాయి. స్థూలంగా 400 బస్సుల ను ప్రతిరోజూ నడపాల్సి వచ్చింది. పీఎన్బీఎస్లో రద్దీ అసాధారణం. ప్రయాణికులతో ప్లాట్ఫామ్లు కిటకిట లాడేవి. దూర ప్రాంతమైన విశాఖపట్నం రూట్కు ఉన్న రద్దీ అంతా ఇంతా కాదు. రోజుకు 15 బస్సులు నడిపే అధికారులు ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని 50 బస్సులు నడిపేవారు! రాయలసీమ సెక్టార్కు కూడా బస్సులు మంచి ఆక్యుపెన్సీతో నడిచేవి! హైదరాబాద్ రూట్కు బస్సులు లేకపోవటంతో అసలైన రద్దీ కనిపించలేదు.
అంతర్గతంగా పల్లెవెలుగు బస్సుల కు మొదట నుంచి అంతగా ఆదరణ లేదు. కానీ, దూర ప్రాంత సర్వీసులకు మాత్రం భలే డిమాండ్ ఉండేది. ఏసీ, సూపర్ లగ్జరీ, ఆల్ర్టా డీలక్స్లకు డిమాండ్ ఉండేది. భౌతిక దూరం ప్రకారం బస్సుల్లో 27 మందిని మాత్రమే తీసుకువెళుతున్నారు. వారం రోజులుగా పరిస్థితి మారిపోయింది. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య పడిపోయింది. కేవలం నలుగురైదుగురే మాత్రమే ప్రయాణికులు. విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, నూజివీడు వంటి ప్రాంతాలకూ తక్కువ మందే ప్రయాణిస్తున్నా రు. జిల్లాలో అంతర్గతంగా ప్రయాణించే వారు బస్సుల పై ఆధారపడటం లేదు.
వ్యక్తిగత వాహనాలు, అత్య వసరమైతే ఆటోలు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. రాయలసీమ సెక్టార్లో నడిచే సూపర్ లగ్జరీ బస్సుల్లో నూ సగానికి పైగా ప్రయాణికుల సంఖ్య పడిపోయింది. విజయవాడ నుంచి విశాఖపట్నం రూట్లో ప్రయాణికుల సంఖ్య 70శాతానికి పైగా పడిపోయింది. మొత్తం 50శాతం బస్సులను ఆర్టీసీ అధికారులు ఉపసంహరిం చుకోవాల్సి వచ్చింది. గతంలో విశాఖపట్నం రూట్లో ఫుల్ ఆక్యుపెన్సీ ఉండేది. ప్రస్తుతం 10-15 మంది లోపే ఉంటున్నారు. 400 మేర నడిపే కృష్ణా రీజియన్ ప్రస్తుతం 200 బస్సులు మాత్రమే నడుపుతోంది.
Updated Date - 2020-07-09T12:29:46+05:30 IST