అది దురుద్దేశ చర్య .. పోలీసులకు ఫిర్యాదు: టీటీడీ అధికారులు
ABN, First Publish Date - 2020-07-07T04:33:51+05:30
టీటీడీ నుంచి గుంటూరుకు చెందిన భక్తుడు (పాఠకుడు) ‘సప్తగిరి’ మాసపత్రికతో ...
తిరుపతి: టీటీడీ నుంచి గుంటూరుకు చెందిన భక్తుడు (పాఠకుడు) ‘సప్తగిరి’ మాసపత్రికతో పాటు ‘సజీవసువార్త’ అనే పుస్తకం పోస్ట్లో పార్శిల్ వెళ్లింది. ఆ పార్శిల్ అందుకున్న ఆయన అన్యమత పుస్తకం రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన టీటీడీ అధికారులు.. ఇది దురుద్దేశ చర్య అని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ సప్తగిరి మాస పత్రికలను పోస్టల్ శాఖ వారే ప్యాక్ చేసి, బరువు చూసి పాఠకుడి చిరునామాలు అతికించి బట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్టల్ శాఖకు పోస్టేజి చార్జీలతో పాటు ఒక్కో ప్రతికి అదనంగా రూ. 1.05 టీటీడీ అదనంగా చెల్లిస్తోంది. పోస్టల్ శాఖ ‘సప్తగిరి’ మాస పత్రికను బుక్ పోస్టులో పంపుతుంది కనుక ఎలాంటి సీలు ఉండదు. ‘సప్తగిరి’ మాస పత్రిక ప్యాకింగ్, డెలివరి బాధ్యత మొత్తం పోస్టల్ శాఖ వారే చూస్తారు. ఈ విషయంపై పలు జిల్లాలకు చెందిన సప్తగిరి పాఠకులకు ఫోన్ చేసి విచారించగా అలాంటి అన్యమత పుస్తకం తమకు అందలేదని తెలియజేశారు. దీనిని దురుద్దేశ చర్యగా భావిస్తూ టీటీడీ తీవ్రంగా పరిగణిస్తోంది.’’ అని అధికారుల ప్రకటన చేశారు.
Updated Date - 2020-07-07T04:33:51+05:30 IST