ఎన్నికల నిర్వహణ పూర్తిగా మా పరిధిలోదే
ABN, First Publish Date - 2020-12-05T07:57:15+05:30
పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎస్ఈసీ పరిధిలోని అంశమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టం చేసింది.
హైకోర్టులో ఎస్ఈసీ వాదన
రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదు
హైకోర్టుకు వివరించిన ఎస్ఈసీ
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎస్ఈసీ పరిధిలోని అంశమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని తెలిపింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎస్ఈసీకి.. ఇతర శాఖలకు చేసినట్లు ఆదేశాలు జారీ చేయజాలదని పేర్కొంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణ ఎంత ముఖ్యమో.. ప్రజారోగ్యం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులు.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఎన్నికల నిర్వహణ నిమిత్తం అది జారీ చేసిన ప్రొసీడింగ్స్ను నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ సోమయాజులు మరోసారి విచారణ జరిపారు.
రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేసే సమయంలో ఏ పరిస్థితులు ఉన్నాయో.. ప్రస్తుతం కూడా అదే వాతావరణం ఉందన్నారు. ‘ఎన్నికల ప్రక్రియలో భాగంగా సభలు, సమావేశాలు జరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఓటు వేసేందుకు ఇక్కడకు తరలివస్తారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఎస్ఈసీ ఎన్నికలు నిలిపివేసింది. ప్రస్తుతం అదే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడంలో హేతుబద్ధత ఏముంది’ అని ప్రశ్నించారు. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. అన్లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రప్రభుత్వం వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, స్కూలు ప్రారంభించాలని నిర్ణయించిన తర్వాతే.. ఎస్ఈసీ వైద్య అధికారులను సంప్రదించి, ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ‘ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో రాజ్యాంగం ఎన్నికల సంఘానికి పూర్తి స్వాతంత్య్రం ఇచ్చింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో పేర్కొంది’ అని తెలిపారు. ఆ ఉత్తర్వుల వివరాలను ఆయన కోర్టు ముందుంచారు.
ఎన్నికల నిర్వహణలో రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలతో స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పనిసరైందన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీపై భరోసా ఉంచాలని కర్ణాటక హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ‘ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదించలేదనే ఆరోపణ ల్లో వాస్త వం లేదు. సీఎస్, పంచాయతీరాజ్ శాఖతో ఎస్ఈసీ పలుమార్లు సంప్రదింపులు జరిపింది. మార్చి నుంచే ఎన్నికల ప్రక్రియ అమల్లో ఉంది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరడం సమంజసం కాదు. ప్రభుత్వవిజ్ఞప్తిని తిరస్కరించాలి’ అని కోరారు. దీనిపై ఏజీ జోక్యం చేసుకుని.. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు.
సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వంతో సంప్రదింపులు అవసరం లేనప్పటికీ, అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడినప్పుడు, తిరిగి ఆ ప్రక్రియను ప్రారంభించే సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు.
Updated Date - 2020-12-05T07:57:15+05:30 IST