‘వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక టీడీపీలోకి వస్తానని..’
ABN, First Publish Date - 2020-09-15T00:23:00+05:30
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసమే
గుంటూరు : జిల్లాలోని వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాలో ఇటీవల ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలు తొలగించిన ఘటన వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ ఘటనపై అధికార పార్టీ స్థానిక నేతలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయమై తాజాగా జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసమే వినుకొండ ఎమ్మెల్యే విగ్రహాలు తొలగించారన్నారు. విగ్రహాలు తొలగింపు విషయం బొల్లా తనకు తెలియదనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
గెలిచాక టీడీపీలోకి వస్తానని చెప్పి..
‘ఎన్నికలకు ముందు వినుకొండ కమ్మ సామాజిక వర్గాన్ని బొల్లా మోసం చేశారు. కమ్మ సామాజికవర్గం వారు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఎన్నికలు తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తానని నమ్మించారు. ఇప్పుడు మాత్రం బొల్లా వినుకొండలో కక్ష్య సాదింపులకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాకుండా బొల్లా అడ్డుకుంటున్నారు. వినుకొండలో బొల్లాకు బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జీవీ ఆంజనేయులు చెప్పుకొచ్చారు.
Updated Date - 2020-09-15T00:23:00+05:30 IST