నగరంలో భారీవర్షం
ABN, First Publish Date - 2020-11-27T06:12:52+05:30
నగరంలో భారీవర్షం
విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : నివర్ తుఫాను కారణంగా నగరంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. రహదారులు నీళ్లతో నిండిపోయాయి. మురికికాల్వలు పొంగిపొర్లాయి. చిట్టినగర్, కబేళా, ఊర్మిళానగర్ తదితర ప్రాంతాల్లో నీరు బాగా నిలిచిపోయింది. నగరంలో గురువారం ఒక్కరోజే 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో చిరు వ్యాపారులు బాగా నష్టపోయారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో చలి ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించింది. రహదారులు అధ్వానస్థితికి చేరుకున్నాయి. వాహనాలు గోతుల్లో పడి వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు విడుదల
వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో మొదలైంది. బ్యారేజీ 12 గేట్లను అడుగు మేర పైకెత్తి 2,940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు ఇచ్చే నీటిని నిలుపుదల చేశారు. పై ప్రాంతాల్లో మరింతగా వర్షాలు కురిస్తే ఈ ఫ్లో పెరిగే అవకాశం ఉంది.
Updated Date - 2020-11-27T06:12:52+05:30 IST