శ్రీకాళహస్తి : శివలింగం ప్రతిష్ట కేసులో కీలక ఆధారాలు
ABN, First Publish Date - 2020-09-17T18:15:00+05:30
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధమైన ఘటనపై
తిరుపతి : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధమైన ఘటనపై తీవ్ర విమర్శలు, నిరసనలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్టించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆలయం మొదటి గేటు వద్ద ఉన్న రంగుల గోపురం నుంచి ముగ్గురు తమిళనాడుకు చెందిన భక్తులు విగ్రహాన్ని సంచిలో భుజంపై మోస్తూ వెళ్లిన దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు.
దొరికినట్లేనా..!?
ఈ నెల 6 తేదీ ఏఏ సమయంలో ఎవరెవరు ఆలయంలోకి వెళ్లారు..?.. ఆ సమయంలో ఆదార్ నమోదును అధికారులు పరిశీలించారు. అదే రోజు ఉదయం 10:50 గంటలకు అనుమానితులు విగ్రహంతో ఆలయంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆలయంలో అనుమానితులు ఎక్కడెక్కడ ఇంకా తిరిగారో సీసీ ఫుటేజ్లో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆరో తేదీ విగ్రహాన్ని అక్రమంగా ప్రతిష్టించినా.. 11వ తేదీ వరకు రామేశ్వరం, కాశీ శివలింగాల మధ్య కొత్తగా మరో లింగం వున్న విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానితులు తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన వారిగా భావించిన ప్రత్యేక పోలీసు బృందం.. ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆదార్ కార్డులోని చిరునామాల్లో సీసీ పుటేజీలోని మనుషులే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2020-09-17T18:15:00+05:30 IST