ఇలాంటి గవర్నర్ రాష్ట్రానికి అవసరమా?: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-06-18T18:48:11+05:30
శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ఆశ్చర్యం, ఆవేదన కలిగించిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
అమరావతి: శాసనమండలిలో నిన్న జరిగిన తీరు ఆశ్చర్యం, ఆవేదన కలిగించిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి ప్రసంగిస్తారని, రాష్ట్రంలో అయితే గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితి అని అన్నారు. కానీ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల సమావేశం జరపలేదని, గవర్నర్ కూడా సభలనుద్దేశించి రాజ్భవన్ నుంచి ఆన్లైన్లో మాట్లాడారని విమర్శించారు. ఇలాంటి గవర్నర్ రాష్ట్రానికి అవసరమా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో సీఎం, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారని.. వాళ్లను అవమానపరిచే విధంగా గవర్నర్ తన ఇంటి నుంచే ఆన్లైన్లో మాట్లాడడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి ఏ ఫైల్ పంపినా దానిపై గుడ్డిగా సంతకం చేయడం గవర్నర్ పనికాదన్నారు. గవర్నర్ సభకు వచ్చి మాట్లాడకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రభుత్వాన్ని, సభ్యులను అవమానపరిచినట్లుగా భావిస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యనించారు.
Updated Date - 2020-06-18T18:48:11+05:30 IST