అయోమయం..గందరగోళం..
ABN, First Publish Date - 2020-05-20T11:34:01+05:30
జిల్లాలో లాక్డౌన్ అమలు విషయంలో స్పష్టత కొరవడింది.
సడలింపులపై కొరవడిన స్పష్టత జిల్లా అంతటా పెరిగిన రద్దీ
గ్రీన్జోన్లలోనూ మధ్యాహ్నం వరకే దుకాణాలకు అనుమతి
ఒంగోలు, మే 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్డౌన్ అమలు విషయంలో స్పష్టత కొరవడింది. అంతటా అయోమయం, గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెడ్జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో నాల్గో విడత లాక్డౌన్ అమలు విషయంలో అనేక మినహాయింపులు ఇచ్చాయి. జిల్లాలో పరిస్థితులను బట్టి వాటిని అమలు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించాయి. రెండు రోజులు గడుస్తున్నా జిల్లాలో తదనుగుణంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నాన్కంటైన్మెంట్ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు కాకపోతుండగా, రెడ్జోన్ ఏరియాల్లో కూడా యంత్రాంగం నియం త్రణ తగ్గిపోయి రద్దీ పెరిగింది. నాల్గో విడత లాక్డౌన్లో ప్రభుత్వం ఉదయం 7నుంచి రాత్రి 7 వరకూ పలు రకాల దుకాణాల నిర్వహణ, వాహనాల రాకపోకలు, జనసంచారం తదితర అంశాల్లో వెసులుబాటు కల్పించింది.
అయితే నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ ఒక్క మద్యం దుకాణాలు మినహా మిగతా వాటిని గతంలో మాదిరి మధ్యాహ్నం ఒంటి గంటకే మూసేస్తున్నారు. మరోవైపు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్న రెడ్జోన్, ఆరెంజ్ జోన్లలో సైతం గతం కన్నా నియంత్రణ పూర్తిగా తగ్గించి వేశారు. దుకాణాలను తెరవనీయడం లేదు తప్ప సాధారణ జన సంచారం, వాహనాల రాకపోకలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పలు పట్టణాల్లో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. వ్యాపార, ఇతర వర్గాల వారికి మాత్రం ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాం గం దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2020-05-20T11:34:01+05:30 IST