కుమారుడి ప్రియురాలితో.. కుమార్తె ప్రియుడిని పిలిపించి.. ఓ తండ్రి చేసిన ఘోరమిది!
ABN, First Publish Date - 2020-05-25T11:12:21+05:30
చీరాలకు చెందిన యువకుడిని హత్య చేసి..
యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఓ యువతి ద్వారా పక్కా ప్రణాళికతో ఫోన్ చేయించి దాడి
ఆ ఘటనలో పాలుపంచుకున్న మరో ఇద్దరి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి
చీరాల(ప్రకాశం): చీరాలకు చెందిన యువకుడిని హత్య చేసి పరారైన కేసులోని నిందితులను చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. చీరాలకు చెందిన నల్లగొండ్ల దినేష్(22) పట్టణంలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన కంపా సంధ్య చీరాల పెంతెకోస్తు చర్చికి వస్తూ దినేష్తో ప్రేమలో పడింది. సంధ్య తండ్రి రాజేష్ విషయాన్ని గ్రహించి కుమార్తెను మందలించాడు. అయినా సంధ్య ప్రేమాయణాన్ని కొనసాగించింది. దీంతో దినేష్ మీద రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని పథకం పన్నాడు. కుమారుడు వంశీ, అతని ప్రియురాలు ఇండ్ల పావని, స్నేహితులు బొజ్జగాని దుర్గారావు, ఓ బాలుడితో ప్లాన్ రూపొందించారు. కుమారుడు వంశీ ప్రియురాలి ద్వారా దినేష్కు ఫోన్ చేయించారు.
హత్యకు మూడు రోజుల ముందునుంచే ఆమెతో తరచూ మాట్లాడించారు. ఆ అమ్మాయి చెప్పిన మేరకు దినేష్ ఈ నెల 8న మండల పరిధిలోని తోటవారిపాలెం సమీపానికి వచ్చాడు. ముందుగా అనుకొన్న పథకం ప్రకారం ప్రియురాలి అన్న వంశీ, దుర్గరావు, మరో మైనర్లు దినేష్ను కోడికత్తితో గొంతులో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసులో వంశీ, దుర్గారావు, పావని, మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, సంధ్య, ఆమె తండ్రి రాజేష్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేముల సుధాకర్, సిబ్బంది వెంకయ్య, హేమచంద్రుడు, భాస్కర్, విజయకృష్ణ, సతీష్, ప్రభావతిని డీఎస్పీ అభినందించారు.
Updated Date - 2020-05-25T11:12:21+05:30 IST