ప్రతి గ్రామంలో పారిశుధ్యం మరింత అభివృద్ధి
ABN, First Publish Date - 2020-04-10T06:08:39+05:30
జిల్లాలోని ప్రతి గ్రామంలో పారిశుధ్యాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు బ్లీచింగ్, శానిటైజింగ్ ద్రావణం పంపిణీ
డీపీవో ధనలక్ష్మి
నెల్లూరు ( జడ్పీ), ఏప్రిల్ 9 : జిల్లాలోని ప్రతి గ్రామంలో పారిశుధ్యాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు బ్లీచింగ్, శానిటైజింగ్ ద్రావణం పంపిణీ చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ధనలక్ష్మి తెలిపారు. పాత జడ్పీ కార్యాలయం నుంచి బ్లీచింగ్, ద్రావణాన్ని పలు పంచాయతీలకు జడ్పీ సీఈవో సుశీలతో కలసి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాల్లో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
కలెక్టర్ రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పల్లెలకు కరోనా దరి చేరకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రాంతాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచేందుకు రూ. 10 లక్షలతో బ్లీచింగ్ను, రూ. 10 లక్షలతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కొనుగోలు చేసి గ్రామాలకు పంపుతున్నామ న్నారు. ప్రతి పల్లెలోనూ పారిశుధ్యాన్ని అభివృద్ధి చేయడం తోపాటు బ్లీచింగ్, ద్రావణాన్ని చల్లేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కరోనాపై చేస్తున్న ఇంటింటా సర్వే ఆశించిన మేరలేదని, వలంటీర్లు సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఈ విషయమై ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం వర్షం కురుస్తున్నందున పారిశుధ్యాన్ని మళ్లీ మొదటి నుంచి చేపట్టాలని ఆదేశించారు.
Updated Date - 2020-04-10T06:08:39+05:30 IST