రివర్స్ టెండరింగా.. రివర్సబుల్ టెండరింగా?
ABN, First Publish Date - 2020-12-02T04:20:01+05:30
జిల్లాలో టెండర్లకు జరుగుతున్నది రివర్స్ టెండరింగా లేక రివర్సబుల్ టెండరింగా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు.
జిల్లాలో జరిగిన టెండర్లలో అక్రమాలు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం
నెల్లూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో టెండర్లకు జరుగుతున్నది రివర్స్ టెండరింగా లేక రివర్సబుల్ టెండరింగా అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. కావలి పరిధిలో పిలిచిన టెండర్, ఎన్టీబీ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్ షెడ్యూల్ ప్రకారం ఆర్అండ్బీ పరిధిలో పిలిచిన రోడ్డు టెండర్కు గత నెల 17న రివర్స్ టెండరింగ్ జరగాల్సి ఉండగా కావలి ఎమ్మెల్యే ఊరిలో లేరని నిర్వహించలేదన్నారు. ఎమ్మెల్యే ఊరిలోకి రాగానే కావలి చోటా షకీల్తో కలిసి ఈ వర్కుకు బహిరంగ వేలం పాట నిర్వహించారని ఆరోపించారు. ఈ తతంగం పూర్తయ్యాక మంగళవారం రివర్స్ టెండరింగ్ నిర్వహించారని, ఇన్ని రోజులు రివర్స్ టెండరింగ్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి అధికార వ్యవస్థ, నిబంధనలు ఎందుకని మండిపడ్డారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చోటా షకీల్ ఉన్నారని, అంతా వారికి అప్పగిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్టీబీ కింద జిల్లాలో ఆరు వర్కులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచారని, దీనికి కూడా ముందుగానే ఒక కాంట్రాక్టర్తో ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. టెండర్లకు వేలం పాటను మొదట నెల్లూరులో పీకే మాఫియా మొదలుపెట్టిందని, తర్వాత రాష్ట్రం మొత్తం పాకిందని విమర్శించారు. గతంలోనూ టెండర్లు ఎవరికి దక్కబోతున్నాయో ముందుగా టీడీపీనే చెప్పిందని వెంకటరమణా రెడ్డి గుర్తు చేశారు. అసలు ఇరిగేషన్ శాఖలో ఏం జరుగుతోందో మంత్రి అనిల్కుమార్యాదవ్కు తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ తెలిసినా ఏం చేయలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఎన్టీబీ వర్కులన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయని ఆరోపించారు.
Updated Date - 2020-12-02T04:20:01+05:30 IST