పంపుసెట్లకు మీటర్లు బిగిస్తేనే ఉచిత విద్యుత్కు అర్హత
ABN, First Publish Date - 2020-10-04T06:53:27+05:30
పంపుసెట్లకు మీటర్లు బిగిస్తేనే ఉచిత విద్యుత్కు రైతులు అర్హత పొదుతారని విద్యుత్శాఖ ఎస్ఈ విజయకుమార్రెడ్డి స్పష్టం చేశారు.
ఎస్ఈ విజయకుమార్ రెడ్డి
కావలి, అక్టోబరు 3: పంపుసెట్లకు మీటర్లు బిగిస్తేనే ఉచిత విద్యుత్కు రైతులు అర్హత పొదుతారని విద్యుత్శాఖ ఎస్ఈ విజయకుమార్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కావలిలోని స్పందన కల్యాణ మండపంలో విద్యుత్ శాఖ నిర్వహించిన డివిజన్స్థాయి రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొనొ మాట్లాడుతూ ప్రతి నెలా ప్రభుత్వం ఉచిత విద్యుత్కు సంబంధించి ఏర్పాటు చేసుకున్న మీటర్ల ప్రకారం బిల్లు నగదు రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. మీటర్లు వలన విద్యుత్లో లైన్లాస్ తెలుస్తోందని, లోఓల్టేజీ లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతి రైతు మీటర్లు బిగించేలా వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో ఎం.దాసు మాట్లాడుతూ రైతులు వ్యవసాయానికి వినియోగించే విద్యుత్కు పంపుసెట్లకు మీటర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని పేర్కొన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకోవాలని, ఆ ఖాతాలో కేవలం విద్యుత్ పంపుసెట్ల మీటర్లకు ప్రభుత్వం ఇచ్చే నగదు లావాదేవీలు మాత్రమే ఉంటాయన్నారు. దీనిపై అవగాహనకు త్వరలో గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి విద్యుత్శాఖ డీఈ భాస్కర్, ఏడీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T06:53:27+05:30 IST