ఆక్రమణల్లో కాలువలు!
ABN, First Publish Date - 2020-12-03T03:19:57+05:30
ఖాళీ జాగా దొరికితే వేసేయ్ పాగా అన్నట్లు.. చెరువుల అలుగులు, వరవ కాలువలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోన్నాయి.
వర్షం వస్తే కావలి మునక
పట్టించుకోని అధికారులు
ఆందోళన చెందుతున్న ప్రజలు
కావలి, డిసెంబరు 2: ఖాళీ జాగా దొరికితే వేసేయ్ పాగా అన్నట్లు.. చెరువుల అలుగులు, వరవ కాలువలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోన్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న కావలి పట్టణంలో విచ్చలవిడిగా వెలుస్తున్న లేఅవుట్ల నిర్వాహకులు సైతం దర్జాగా కాలువలను ఆక్రమించి చదును చేసి నిర్మాణాలు చేపడుతుండడంతో భారీ వర్షాలు వస్తే వర్షపునీరు పోయే మార్గంలేక కావలి ముంపునకు గురవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆక్రమణలో మందాటి చెరువు అలుగు కాలువ
ట్రంకురోడ్డుకు పడమరవైపున ఉన్న ముసునూరు మందాటి చెరువు అలుగు నీరు పారే కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురై అక్కడ భవన నిర్మాణాలు జరుగుతోన్నాయి. దీంతో నీరు పోయేందుకు మార్గంలేక ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చెరువు నిండి అలుగు ద్వారా వచ్చే నీరంతా ట్రంకురోడ్డుకు చేరి జలమయమైంది. అక్కడి నుంచి బృందావనం హౌసింగ్ కాలనీని చుట్టుముట్టింది. వాస్తవానికి మందాటి చెరువుకు గతంలో ఉన్న అలుగు కింద స్థలాలు పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో ఆ తర్వాత మరొక అలుగు నిర్మించారు. దాని కింద కూడా ఆక్రమణలు జరిగి నిర్మాణాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
పాపిరెడ్డి చెరువు అలుగు కాలువ ఆక్రమణ
ట్రంకురోడ్డుకు తూర్పు వైపున పట్టణాన్ని ఆనుకుని ఉన్న పాపిరెడ్డి చెరవు అలుగు నీరు వెళ్లే కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దీంతో ఈ వర్షాలకు చెరువు నీరు అలుగు ద్వారా పోయేందుకు వీలులేక చెరువు లోతట్టు ప్రాంతంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ నీటమునిగి విద్యుత్ సరఫరాకు రెండు రోజులు అంతరాయం ఏర్పడింది. అలాగే పొలాలతో పాటు కావలి-తుమ్మలపెంట రోడ్డుపై పారటంతో ఆ రోడ్డు జలమయమైంది. వాస్తవానికి తుమ్మలపెంట రోడ్డు వెంబడి అలుగు నీరు పోయేందుకు ఉన్న కాలువను పూర్తిగా పూడ్చివేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దానిని కలుపుకున్నారు. దీంతో వర్షపు నీరు పోయేందుకు రోడ్డే మార్గం కావటంతో ఆరోడ్డు దెబ్బతింది. పాపిరెడ్డి చెరువుకు వెళ్లే వరవ కాలువ గతంలో చాలా వరకు ఆక్రమణలకు గురికాగా ఉన్న కాలువ ఆక్రమణలకు గురి కాకుండా రెండు వైపులా కాంక్రీట్ వాల్ నిర్మించారు. ఆ కాలువ వైకుంఠపురం అన్నపుగుంట నుంచి రైల్వేట్రాక్ దాటుకుని రావాల్సి ఉంది. అయితే రైల్వే మూడోలైను పనులు జరుగుతున్న దృష్ట్యా ఆ కాలువ వద్ద రైల్వే వంతెన నిర్మిస్తూ అక్కడ ఎత్తుగా మట్టి తోలడంతో వర్షపు నీరు పోయేందుకు మార్గంలేక వైకుంఠపురం, జనతాపేట ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ స్థలాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన కాలువలు ఆక్రమణలకు గురవుతున్నా మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదలశాఖ, ఆర్అండ్బీ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవటంలేదన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణల వలన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం కావటమే కాక వాటి వలన పట్టణ ప్రజలకు ముంపు పొంచి ఉంది. ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇస్తున్నారంటే ఆక్రమణదారుల నుంచి అందరికీ భారీగా ముడుపులు ముట్టుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి కాలువల ఆక్రమణలపై చర్యలు తీసుకుని వాటి వలన పొంచి ఉన్న వరద ముంపు నుంచి ప్రజలను కాపాడాల్సి ఉంది.
Updated Date - 2020-12-03T03:19:57+05:30 IST