నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం
ABN, First Publish Date - 2020-12-02T04:09:37+05:30
నివర్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు వై.అనందకుమారి పేర్కొన్నారు.
జేడీఏ అనందకుమారి
దుత్తలూరు(ఉదయగిరి రూరల్)/వరికుంటపాడు, డిసెంబరు 1: నివర్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు వై.అనందకుమారి పేర్కొన్నారు. దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న మినుము, పెసర పంటలను మంగళవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 33 వేల హెక్టార్లలో మినుము, పెసర, మొక్కజొన్న, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఉదయగిరి, వింజమూరు సబ్ డివిజన్ల పరిధిలో అధికంగా కోతకొచ్చిన మినుము పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. నష్టపోయిన రైతుల వివరాలు 6, 7వ తేదీల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద జాబితా ప్రదర్శిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.43 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. నష్టపోయిన అపరాల పంటకు ఒక హెక్టారుకు రూ.10 వేలు, వరి పంటకు రూ.15 వేలు పరిహారం ఇస్తారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఆర్ఎస్ శాస్త్రవేత్త ఓ.వెంకటేశ్వర్లు, ఏడీఏ రవిచంద్రప్రసాద్, ఏవోలు చెన్నారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చక్రవర్తి, ఏఈవోలు వెంకటశివజ్యోతి, నారాయణ, వీఏఏలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T04:09:37+05:30 IST