48 గంటల్లో అల్పపీడనం
ABN, First Publish Date - 2020-10-01T09:24:53+05:30
ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది...
- రాష్ట్రంలో నేడు..రేపు వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, బుధవారం కర్నూలు జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
Updated Date - 2020-10-01T09:24:53+05:30 IST