20 వరకు తేలికపాటి వర్షాలే
ABN, First Publish Date - 2020-06-18T12:07:13+05:30
20 వరకు తేలికపాటి వర్షాలే
విశాఖపట్నం, అమరావతి(ఆంధ్రజ్యోతి): జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా కొంకణ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లోని మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. బుధవారం చిత్తూరు జిల్లా విజయపురంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాష్ట్రంలో ఈనెల 20వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే పరిస్థితులు లేవని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ఈనెల 21న కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
Updated Date - 2020-06-18T12:07:13+05:30 IST