స్టైరిన్ దెబ్బతో కేన్సర్ ముప్పు!
ABN, First Publish Date - 2020-06-01T08:10:58+05:30
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన స్టైరిన్ గ్యాస్ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి ..
ఐసీఎంఆర్-ఎన్ఐవోహెచ్ హెచ్చరిక
విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన స్టైరిన్ గ్యాస్ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి - జాతీయ వృత్తిపరమైన ఆరోగ్య సంస్థ (ఐసీఎంఆర్-ఎన్ఐఓహెచ్, అహ్మదాబాద్) పేర్కొంది. విషపూరిత వాయువు పీల్చిన వారు కేన్సర్ బారిన పడే అవకాశముందని... ముఖ్యంగా పిల్లలకు ఆ ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల స్టైరిన్ గ్యాస్ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సుదీర్ఘకాలం నిపుణుల పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది. ఇక గర్భిణుల విషయంలో మరింత సునిశిత పర్యవేక్షణ అవసరమని స్పష్టంచేసింది. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఐసీఎంఆర్-ఎన్ఐఓహెచ్ డైరెక్టర్ డాక్టర్ కమలేశ్ దీనిపై లేఖ రాశారు. ‘‘లాక్డౌన్ అమలులో ఉన్నా సరే... గ్యాస్ లీక్ ప్రమాద ప్రాంతంలో ప్రజలపై అధ్యయనం చేయాలి’’ అని సూటిగా చెప్పారు. ఈ లేఖలోని ముఖ్యాంశాలు...
అమెరికాకు చెందిన పర్యావరణ రక్షణ సంస్థ పరిశోధన ప్రకారం, స్టైరిన్ వాయువు పీల్చిన స్థాయిని బట్టి... కంటిలో దురద, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి తలనొప్పి, మత్తు, నీరసంగా ఉండడం, మానసిక ఒత్తిడి, నరాల వ్యవస్థ పనిచేయకపోవడం వంటివి సంభవిస్తాయి. వినికిడి శక్తి కోల్పోతారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యం చేసే డాక్టర్లు ప్రధానంగా కేన్సర్పై ఎక్కువగా దృష్టిసారించాలి.
వైద్య రంగ పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) సంస్థ ప్రతి దానికీ లేబుల్ చేస్తోంది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం... స్టైరిన్ గ్యాస్ పీల్చడం వల్ల కేన్సర్ సోకే ప్రమాదముంది. ప్రమాదకరమైన ఎ-2 (అధిక పరిమితి)తో కూడుకున్న రక్త, శోషరస సంబంధ కేన్సర్ సోకే అవకాశం ఉంది. ప్రధానంగా పిల్లల్లో ఇటువంటి కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఐఏఆర్సీ పరిశోధనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ సలహాదారు డాక్టర్ తుషార్ కాంత్జోషి కూడా ఏకీభవించారు.
నవజాత శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, పునరుత్పత్తి అవయవాలు, వినికిడి సమస్య, చూపు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రాణాలతో బయటపడిన వారి వైద్యానికి సమష్టి ప్రణాళిక అవసరం. ఇందుకు జోషి సూచనను పరిగణనలోకి తీసుకోవాలి.
పర్యవసానాలు చెప్పాలి...: విశాఖ ఘటన నేపథ్యంలో నిపుణులు 1984లో భోపాల్ దుర్ఘటన గుర్తు చేశారని ఈ లేఖలో తెలిపారు. ‘‘ఆ ఘటన నుంచి బయటపడిన వారంతా ఇప్పటికీ బాధపడుతున్నారు. అటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తం కావాలి. లీకైన స్టైరిన్ గ్యాస్ కచ్చితమైన స్వభావం, ప్రభావితమయ్యే పర్యవసానాలను ప్రజలకు చెప్పడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు. భోపాల్ ఘటన తరువాత అక్కడ ప్రజల కోసం పనిచేసే సామాజిక కార్యకర్త ఒకరు...ఈ రెండు ఘటనలను ఒకేలాంటివని పోల్చారు.
ఇదొక గుణపాఠం: పాలిమర్స్ దుర్ఘటన విశాఖ స్మార్ట్సిటీ ప్లానర్లకు ఒక గుణపాఠం. కర్మాగారానికి సమీపంలో ఉన్న గోపాలపట్నం ఇప్పుడు రద్దీ ప్రాంతం. ఆరు దశాబ్దాల క్రితం హిందూస్థాన్ పాలిమర్స్ స్థాపించినప్పుడు ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే, అందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని పట్టణ ప్రాంతాలపై అధ్యయనం చేసే నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-06-01T08:10:58+05:30 IST