దాచుకున్న సొమ్ము కాజేశాడు
ABN, First Publish Date - 2020-12-05T05:29:35+05:30
రుద్రవరం పోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న డబ్బును సబ్ పోస్టుమాస్టర్ కాజేశాడు. ఈ సంగతి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
- రుద్రవరం పోస్టాఫీసులో అవినీతి
- సబ్ పోస్టుమాస్టర్పై చర్యలు
- దండోరా వేయించిన పోస్టల్ అధికారులు
రుద్రవరం, డిసెంబరు 4: రుద్రవరం పోస్టాఫీసులో ఖాతాదారులు దాచుకున్న డబ్బును సబ్ పోస్టుమాస్టర్ కాజేశాడు. ఈ సంగతి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఈ విషయం రెండు రోజుల కింద పోస్టల్ అధికారులు ఊళ్లో దండోరా వేయించారు. మైక్లో ప్రచారం చేయించారు. ఖాతాదారులు కార్యాలయానికి వచ్చి తమ సొమ్ము వివరాలను చెక్ చేయించుకోవాలని సూచించారు. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. గురు, శుక్రవారాల్లో రుద్రవరం పరిఽధిలోని సుమారు 4 వేల మంది ఖాతాదారులు పోస్టాఫీసుకు బారులు తీరారు. వాస్తవానికి సబ్ పోస్టుమాస్ట్టర్ రాజ్కుమార్ అవినీతికి పాల్పడినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించి సెప్టెంబరు 16న సస్పెండ్ చేశారు. ఇన్చార్జిగా నిఖిల్ అనే వ్యక్తిని నియమించి ఏఏ ఖాతాల్లో ఎంత అవినీతి జరిగిందో పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎస్ఎస్వై, ఎంఐఎస్, ఎన్ఎస్సీ, కేవీపీ ఖాతాలతో పాటు ఇంకా పలు ఖాతాలు ఈ శాఖలో ఉన్నాయి. కొంత సొమ్ము స్వాహా చేసినట్లు పోస్టల్ ఉన్నతా ధికారుల విచారణలో వెల్లడైంది. 250 పోస్టల్ ఖాతా పుస్తకాల్లో రూ.60వేలు అవినీతి జరిగినట్లు పోస్టల్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఇంకా 550 పుస్తకాలు పరిశీలించాల్సి ఉంది. ఆ ఖాతాలు కూడా పరిశీలించాక ఎంత అవినీతి జరిగిందీ వెల్లడిస్తామని తెలిపారు.
Updated Date - 2020-12-05T05:29:35+05:30 IST