ఆర్ఏఆర్ఎస్ భూములు ఇవ్వొద్దు
ABN, First Publish Date - 2020-11-08T04:45:54+05:30
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన భూమిని వైద్య కళాశాల కోసం ఇవ్వొద్దని టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బంది, ఆర్ఏఆర్ఎస్ భూములను నమ్ముకొని పని చేస్తున్న వ్యవసాయ కూలీలు డిమాండ్ చేశారు.
టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బంది, వ్యవసాయ కూలీల ధర్నా
నంద్యాల, నవంబరు 7: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన భూమిని వైద్య కళాశాల కోసం ఇవ్వొద్దని టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బంది, ఆర్ఏఆర్ఎస్ భూములను నమ్ముకొని పని చేస్తున్న వ్యవసాయ కూలీలు డిమాండ్ చేశారు. శనివారం ఆర్ఏఆర్ఎస్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి ఎంతో చరిత్ర ఉందని, అలాంటి చరిత్రను కూడా పట్టించుకోకుండా భూమిని ఇతర అవసరాల కోసం కేటాయించడం సరికాదన్నారు. ఇక్కడి భూముల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి వివిధ రకాల పంటల్లో కొత్త వంగడాలను సృష్టించి వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఎంతో కీలకంగా పని చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధనా స్థానాల్లో ఏ-1 గ్రేడ్ స్థాయిలో ఉన్న నంద్యాల ఆర్ఏఆర్ఎస్ను మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి ఉనికికే తూట్లు పొడవాలని చూస్తుండటం దారుణమని అన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. వైద్య కళాశాల కోసం ఆర్ఏఆర్ఎస్ పొలాలను ఇస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని హెచ్చరించారు. పరిశోధనా పొలాల్లో కూలీ పని చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ఏఆర్ఎస్పై ఆధారపడి బతుకుతున్నామని, దాదాపు 200కు పైగా టైమ్ స్కేల్, కాంట్రాక్టు సిబ్బంది, వ్యవసాయ కూలీల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఆర్ఏఆర్ఎస్ భూముల తరలింపునకు మద్దతు ఇస్తే నాయకుల ఇళ్ల ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు.
Updated Date - 2020-11-08T04:45:54+05:30 IST