పుష్కరుడికి సెలవు
ABN, First Publish Date - 2020-12-01T05:30:00+05:30
పన్నెండు రోజుల పాటు భక్తులను పారవశ్యంలో ముంచెత్తిన తుంగభద్ర పుష్కరాలు మంగళవారం ముగిశాయి.
- చివరిరోజున తరలి వచ్చిన భక్తజనం
- సందడిగా మారిన సంకల్భాగ్ ఘాట్
- సమష్టి కృషితో పుష్కరాలు విజయవంతం
- కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ వీరపాండియన్
- నదీమతల్లికి వస్త్ర సమర్పణ.. జలహారతిలహారతి
కర్నూలు (కల్చరల్), డిసెంబరు 1:
పన్నెండు రోజుల పాటు భక్తులను పారవశ్యంలో ముంచెత్తిన తుంగభద్ర పుష్కరాలు మంగళవారం ముగిశాయి. పన్నెండోరోజు పుష్కర వేడుకలకు భక్తజనం తరలి వచ్చారు. తుంగభద్రమ్మ ఒడిలో పుష్కర స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నదిలో దీపాలు వదిలారు. వివిధ ప్రాంతాల భక్తులు చివరి రోజున పవిత్ర స్నానాలు ఆచరించి, పిండప్రదానాది కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని కొన్ని ఘాట్లు భక్తులు లేక వెలవెల బోగా, మంత్రాలయం, సంగమేశ్వరం, కర్నూలు సంకల్బాగ్ ఘాట్లలో సందడి గంటగంటకూ పెరిగింది.
వేడుకలు విజవయంతం
తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరిగాయని, విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజే స్తున్నామని కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. సంకల్బాగ్ పుష్కర ఘాట్లో చివరి రోజు కార్యక్రమాల్లో కలెక్టర్, ఆయన సతీమణి ఆండాళ్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు సయ్యద్ ఖాజా మొహిద్దీన్, రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీ, ఆయన సతీమణి పృథ్వీ కల్యాణి పాల్గొన్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా అభిజిత్ లగ్నంలో దేవదాయ శాఖ వేద పండితులు నిర్వహించిన మహాశాంతి హోమంలో పాల్గొన్నారు. యజ్ఞ దేవతకు హవిస్సుతో కూడిన నవవిధ ధాన్య పుష్పాదులను పూర్ణాహుతిలో సమర్పించారు.
జిల్లా ప్రజలు సంతోషంగా జీవించేలా చూడాలని తుంగ భద్రమ్మను ప్రార్థించామని కలెక్టర్ అన్నారు. కొవిడ్ వల్ల ప్రత్యేక పరిస్థితులు ఉన్నా, వేడుకలు నిర్వహించామని, అన్ని వర్గాల వారు పూర్తిగా సహకారం అందించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తుంగభద్ర నది పుష్కరాలకు సంపూర్ణ మద్దతునిచ్చి నిధుల మంజూరు, ఏర్పాట్లలో సహకరించారని అన్నారు.
ఎస్పీ కె. ఫక్కీరప్ప మాట్లాడుతూ తుంగభద్ర నది పుష్కర వేడుకలను అధికారులందరూ విజయవంతం చేశారని అన్నారు. పారి శుధ్య సిబ్బంది, ట్రాఫిక్, కమ్యూనికేషన్ తదితర అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. నగరపాలక సంస్థ నిధులు రూ.7.50 లక్షల తో కొనుగోలు చేసిన 30 పోలీస్ కంట్రోల్ వైర్లెస్ సెట్లను ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషాకు కలెక్టర్, ఎస్పీ, నగరపాలక కమిషనర్ పంపిణీ చేశారు.
మహానంది వేద పండితుడు రవిశంకర్ అవధాని బృందం ఆధ్వర్యంలో కలెక్టర్ వీర పాండియన్ తుంగభద్ర నదీమతల్లికి వస్త్రాలను తీసుకువచ్చారు. ఎస్పీ, కమిషనర్, ఇతర అధికారులు పూజాద్రవ్యాలతో నది వద్దకు చేరుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసి పుష్కరుడిని తుంగభద్ర నదిలో జల నిక్షిప్తం చేశారు. తుంగభద్రమ్మకు వస్త్ర సమర్పణ చేశారు. అనంతరం పంచ హారతులను ఇచ్చారు. ముగింపు వేడుకలను వేలాది మంది భక్తులు తిలకించారు.
సంగమేశ్వరంలో సందడి
ఆత్మకూరు/కొత్తపల్లి: సంగమేశ్వర క్షేత్రానికి చివరి రోజు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. షవర్ల వద్ద జల్లుస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం పుష్కర ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. ఆ తర్వాత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజు సుమారు 1450 మంది భక్తులు వచ్చారు. మొత్తంగా సంగమేశ్వరానికి 15 వేల మందికి పైగా వచ్చివెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ఎగువ ఉమామహేశ్వరాలయంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి తుంగభద్ర మాత ఎదుట దీపాలు వెలిగించారు. సాయంత్రం 4 గంటల సమయంలో దేవతామూర్తుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం నదీజలాలకు సంధ్యాహారతి నివేదించి, వాయనాన్ని సమర్పించారు. క్షేత్రంలో 12రోజుల పాటు కొనసాగిన పుష్కర బృహస్పతి గాయత్రీయాగానికి పూర్ణాహుతి పలికారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రమోహన్, డ్వామా పీడీ వెంగన్న, ఎంపీడీవో చంద్రశేఖర్, అగ్నిమాపక కేంద్రం అధికారి భీముడునాయక్ను దేవస్థానం తరపున ఈవో నాగప్రసాద్ సత్కరించారు. పుష్కర విధులకు హాజరైన పోలీసు సిబ్బందికి బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. అందరి సహకారంతో పుష్కరాలను విజయవంతంగా పూర్తిచేశామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు.
ముగిసిన పుష్కర సంబరం
మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్: పవిత్ర తుంగభద్ర పుష్కరాలు మంగళవారం ముగిశాయి. పన్నెండు రోజుల పాటు మంత్రాలయంలోని తుంగభద్ర తీరంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. చివరిరోజు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు., మఠం వీఐపీ ఘాట్, మఠం ఘాట్ వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలి సూర్యనమస్కారాలు చేశారు. పలువురు పిండ ప్రదానం చేశారు. ఘాట్ల వద్ద పూజల అనంతరం గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది పుష్కరుడు తుంగభ్రదలోనే ఉంటాడని, ఏడాదంతా తుంగభద్ర నదిలో పుష్కరస్నానం యోగ్యమని పండితులు పేర్కొన్నారు.
Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST