హెడ్ కానిస్టేబుల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ABN, First Publish Date - 2020-11-24T06:08:35+05:30
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సస్పెండైన క్రైం వింగ్ హెడ్కానిస్టేబుల్ గంగాధర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది.
- డిస్మిస్ చేయాలని డీజీపీకి నివేదిక?
నంద్యాల (నూనెపల్లె), నవంబరు 23: అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సస్పెండైన క్రైం వింగ్ హెడ్కానిస్టేబుల్ గంగాధర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. గతంలో అసాంఘిక శక్తులతో సంబంధాలు, దందాలు, అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్న హెడ్కానిస్టేబుల్ గంగాధర్ ప్రస్తుతం అబ్దుల్ సలాంపై పెట్టిన కేసులలో అతిగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థకే కళంకం తెచ్చాడని ఆ శాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయనపై ఆరోపణలు రావడంతో ఆత్మకూరుకు బదిలీ చేశారు. మళ్లీ నంద్యాలలోని ఓ వైసీపీ నాయకుడి ప్రమేయంతో నంద్యాల వన్టౌన్ పోలీస్ స్టేషన్కు పోస్టింగ్ వేయించుకున్నారు. ఆతర్వాతే నిమిషాంబదేవి జ్యువెలరీ షాపులో చోరీ, ఆటోలో నగదు చోరీ కేసులకు సంబంధించి అబ్దుల్ సలాంను వేధించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో హెడ్కానిస్టేబుల్తో పాటు సీఐని కూడా అరెస్టు చేసిన సంగతి విదితమే. విధి నిర్వహణలో వ్యవహరించిన తీరు, విధుల దుర్వినియోగం, సలాం కేసులో వ్యవహరించిన తీరును ఆధారంగా చేసుకుని గంగాధర్ను డిస్మిస్ చేయాలని డీజీపీకి నివేదికను పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.
Updated Date - 2020-11-24T06:08:35+05:30 IST