విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2020-10-30T10:43:30+05:30
వ్యవసాయ బోరుకు మోటారు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు.
పొలంలో మోటారు బిగిస్తుండగా ప్రమాదం
పత్తికొండ, అక్టోబరు 29: వ్యవసాయ బోరుకు మోటారు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పత్తికొండ శివారులోని సుస్వాగతం బోర్డు సమీపంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పత్తికొండ మండల కనకదిన్నె గ్రామానికి చెందిన వి కౌలుట్లగౌడ్ బోరు మెకానిక్ పని చేస్తుంటాడు. పత్తికొండ బస్టాండ్ రోడ్డులో బోరువెల్ పనుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈశ్వరయ్య అనే కౌలురైతు పొలంలో వ్యవసాయ బోరు మరమ్మతు పనుల కోసం తన సహాయకుడు బజారితో కలిసి గురువారం ఉదయం వెళ్లాడు. బోరు సమీపంలోనే 11 కేవీ విద్యుత్ తీగలు ఉన్నాయి. వీటికి కొద్ది దూరంలో క్రేన్ నిలుపుకుని మోటారు మరమ్మతు చేశాడు. పని ముగిశాక క్రేన్ను కిందకు దించుతుండగా పక్కకు ఒరిగి 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో కౌలుట్ల, బజారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వీరిని రక్షించేందుకు ప్రయత్నించినా రైతు ఈశ్వరయ్యకు గాయాలయ్యాయి. మృతి చెందిన కౌలుట్లకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఏఈ రవీంద్రనాయక్ పొలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పత్తికొండ సీఐ ఆదినారాయణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-10-30T10:43:30+05:30 IST