ఇళ్లకే పరిమితం
ABN, First Publish Date - 2020-03-27T10:23:44+05:30
లాక్డౌన్ అమలుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యం
లాక్డౌన్ కఠినంగా అమలు
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
మోటార్ సైకిళ్ల సీజ్
గ్రామాల్లో కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసిన ప్రజలు
నందికొట్కూరు, మార్చి 26: లాక్డౌన్ అమలుతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కిరాణం, కూర గాయలు, పండ్లు దుకాణాలు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే తెరిచారు. కిరాణం సరుకులు కొనేవారు అరకొరగానే బయటకు వచ్చారు. పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లే వారు, మెడికల్ మందులు కొనే వారకి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
బన గానపల్లె
పట్టణంలో నాలుగో రోజు లాక్డౌన్ కఠినంగా అమలు చేశారు. గురువారం సీఐ సురే్షకుమార్రెడ్డి, ఎస్ఐలు కృష్ణమూర్తి, మహే్షకుమార్, పోలీసు సిబ్బంది ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామాల నుంచి పట్టణానికి రాకుండా చెక్పోస్టుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
యాగంటిపల్లెరోడ్డు, కర్నూలు, నంద్యాల రోడ్లు, అవుకు మెట్ట వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి మోటారుసైకిళ్లు, ఇతర వాహనాలను అనుమతించకుండా కఠినంగా వ్యవహరించారు. అత్యవసర రవాణా, వాహనాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. పట్టణంలోని వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ చేయించారు. పట్టణంలో 8 చోట్ల కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. కస్బా స్కూల్, జీఎం టాకీసు, డిగ్రీ కళాశాల తదితర చోట్ల ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే కూరగాయలు కొనే విధంగా చర్యలు తీసుకున్నారు.
Updated Date - 2020-03-27T10:23:44+05:30 IST