ప్రయాణం.. నరకం
ABN, First Publish Date - 2020-10-23T10:42:16+05:30
ర్నూలు-అమరావతి రహదారిలో ప్రయాణం నరకంగా మారింది. ప్రకాశం జిల్లా పరిధిలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి ఇరువైపులా గుంతలు పడ్డాయి.
ఘాట్ రోడ్డు పక్కన గుంతలు
చెరువు మట్టితో నింపిన అధికారులు
వర్షాలకు ఇరుక్కుపోతున్న వాహనాలు
ఆత్మకూరు, అక్టోబరు 22: కర్నూలు-అమరావతి రహదారిలో ప్రయాణం నరకంగా మారింది. ప్రకాశం జిల్లా పరిధిలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి ఇరువైపులా గుంతలు పడ్డాయి. దీంతో అక్కడి అధికారులు వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి ఎర్రమట్టిని వేశారు. వర్షాలకు ఆ మట్టి రోడ్డు మీదికి చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ పరిస్థితి కర్నూలు జిల్లా పరిధిలోని కేజీ రహదారిపై కూడా ఉంది. ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి దెబ్బతింది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడటంతో వాహనాల ఇంజన్లకు ముప్పు వాటిల్లింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు నేషనల్ హైవే అధికారులు సిద్ధాపురం చెరువు సమీపంలోని మట్టిని తెచ్చి గుంతలను పూడ్చారు. లోతైన గుంతల్లో మట్టిని వేయడం వల్ల రోడ్డంతా బురదమయంగా మారింది. పైగా ఆ గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. చిన్న వాహనాలు మట్టిలో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ స్తంభించి పోతోంది. సంజీవనగర్ తండా, వెంకటాపురం సమీపంలోని పల్లకట్ట ప్రదేశంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విజయవాడ, శ్రీశైలం, కోస్తాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు చాలా ఇబ్బందిగా ఉంది.
Updated Date - 2020-10-23T10:42:16+05:30 IST