వైసీపీ నేత యార్లగడ్డ బర్త్ డే వేడుకలు బంద్.. ఫ్యాన్స్ ఆగ్రహం
ABN, First Publish Date - 2020-10-04T19:25:21+05:30
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు బంద్ అయ్యాయి!
అమరావతి : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు బంద్ అయ్యాయి!. ఇవాళ యార్లగడ్డ పుట్టిన రోజు. తమ అభిమాన నేత బర్త్ డే వేడుకలు జరపడానికి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో పోలీసులు షాక్ ఇచ్చారు. కేక్ కటింగ్ చేసి హడావుడి చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పుట్టినరోజు వేడుకలు ఎక్కడ బహిరంగంగా ప్రదేశాల్లో చేయకూడదని యార్లగడ్డ అభిమానులకు పోలీసులు షరతులు విధించారు.
అంతేకాదు.. 144,30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉన్నవని.. ఎక్కడా కేక్ కట్టింగ్, ప్లెక్సీలు, గుంపులుగా జనాలు రోడ్లపైకి రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే పోలీసుల తీరుపై యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావు ఏమైనా తప్పులు చేశారా..? పోనీ ఏమైనా దోపిడీలు చేశారా..? అసలు ఎందుకిలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు..? అభిమానులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు స్పందించిన పోలీసులు తమకు ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెబుతున్నారు.
కాగా.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్న రోజు నుంచి స్థానిక నేతలకు ఆయనకు పడట్లేదు. వంశీ రాజీనామా చేస్తే తానే వైసీపీ తరఫున పోటీ చేస్తానని వల్లభనేని వంశీ.. కాదు తానే పోటీ చేస్తానని యార్లగడ్డ మీడియా ముందుకొచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చుకున్న విషయం విదితమే. మరోవైపు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుకు కూడా వంశీ పడట్లేదు. శనివారం నాడు ఓ శంకుస్థాపన కార్యక్రమంలో దుట్టా-వంశీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో ఇవాళ పోలీసులు పెట్టిన కండిషన్స్తో యార్లగడ్డ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-10-04T19:25:21+05:30 IST