సీఎం జగన్పై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
ABN, First Publish Date - 2020-12-04T15:27:45+05:30
ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్నారని సీఎం జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్నారని సీఎం జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ... పేదలకు ఇళ్ళు అన్నీ ఉచితమని పాదయాత్రలో చెప్పిన జగన్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఇది విశాఖ వాసులకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనాను చులకన చేసి మాట్లాడటం వల్లే 7వేల మంది చనిపోయారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ...ఆస్తి పన్నును పెంచుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టటం చేశారు. మండలిలో ఆస్తి పన్ను పెంపు బిల్లును వెనక్కు తిప్పి పంపినా.. అసెంబ్లీలో వైసీపీ రెండు సార్లు ఆమోదించిందన్నారు. ఆస్తి పన్ను బిల్లును వెనక్కు తీసుకునేంత వరకు పోరాడతామని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.
Updated Date - 2020-12-04T15:27:45+05:30 IST