అదే నిజమైతే...వాళ్లకు హిందూ దేవుళ్లే కనిపిస్తున్నాయా?: శివస్వామి
ABN, First Publish Date - 2020-11-03T17:30:57+05:30
శివగిరి కొండపై కృష్ణుని విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు.
విజయవాడ: శివగిరి కొండపై కృష్ణుని విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. మొగల్రాజపురంలోని శివగిరి కొండపై ధ్వంసమైన కృష్ణుని విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 60 చోట్ల హిందూ ఆలయాల పై దాడులు జరిగాయని తెలిపారు. ఆకతాయిలు, మతిస్థిమితం లేని వారి పనిగా పోలీసులు చెబుతున్నారని.... అదే నిజమైతే వారికి కేవలం హిందూ దేవుళ్ల విగ్రహాలే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అంత యంత్రాంగం ఉన్నా దోషులను పట్టుకోవడం లేదంటే తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. విదేశీ వ్యక్తుల ప్రమేయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ప్రభుత్వం తీరు ఉందన్నారుు. హిందూ ఆలయాల సొమ్ములను వాడుకుంటున్న ప్రభుత్వం వాటి పరిరక్షణను ఎందుకు పట్టించుకోదని నిలిదీశారు. ఈ దాడులను పూర్తిగా నియంత్రించేలా సీఎం స్వయంగా సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని...లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని... ప్రభుత్వాలు ఎటువంటి ఆంక్షలు విధించకుండా సహకరించాలని శివస్వామి డిమాండ్ చేశారు.
Updated Date - 2020-11-03T17:30:57+05:30 IST