నేల మాళిగలో చౌక బియ్యం
ABN, First Publish Date - 2020-10-19T17:05:53+05:30
ఎందెందు వెతికినా రేషన్ బియ్యం నిల్వలే. పేద ప్రజల కడుపు నింపాల్సిన ఈ బియ్యం చీకటి వ్యాపారుల చేతుల్లోకి చేరిపోతోంది.
144 క్వింటాళ్ల నిల్వలు గుర్తించిన అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎందెందు వెతికినా రేషన్ బియ్యం నిల్వలే. పేద ప్రజల కడుపు నింపాల్సిన ఈ బియ్యం చీకటి వ్యాపారుల చేతుల్లోకి చేరిపోతోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత చిట్టినగర్ మసీదు సమీపంలో ఓ పురాతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లోనూ, అక్కడ ఉన్న నేల మాళిగలోనూ అక్రమంగా నిల్వ ఉంచిన చౌక బియ్యాన్ని విజయవాడ డివిజన్ సహాయ పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఇటీవల పౌర సరఫరాల శాఖ దాడులు జరిపి రెండు ప్రాంతాల్లో చౌక బియ్యం నిల్వలను పట్టుకున్నారు. తాజాగా చిట్టినగర్ మసీదు ప్రాంతంలో స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవాడ డివిజన్ సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి ఈబీ విలియమ్స్ బృందం మెరుపు దాడులు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 144 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మసీదు దగ్గర చిల్లర దుకాణాన్ని నిర్వహించే తిలక్కు చెందిన పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఈ నిల్వలను అధికారులు గుర్తించారు. అందులోనే ఓ చిన్న నేలమాళిగలో నుంచి పై వరకు 284 బియ్యం బస్తాలున్నట్టు సివిల్ సప్లయిస్ అధికారులు గుర్తించారు. వెంటనే విజయవాడ డివిజన్ ఏఎస్వో విలియమ్స్ దుకాణ యజమాని తిలక్పై 6ఏ కేసు నమోదు చేశారు. తాను ఈ బియ్యాన్ని రూ.5కు కొనుగోలు చేసి, రూ.10కి బయట విక్రయిస్తుంటానని ఆ వ్యాపారి చెప్పినట్టు సమాచారం.
Updated Date - 2020-10-19T17:05:53+05:30 IST