ప్రభుత్వ ల్యాబ్లో పాజిటివ్.. ‘ప్రైవేటు’లో నెగెటివ్
ABN, First Publish Date - 2020-06-18T09:46:08+05:30
కరోనా ఎవరిపై ఎప్పుడు వాలుతుందో తెలియదు. మనం జాగ్రత్తలు తీసుకున్నా చుట్టుపక్కల వారి గురించి భయపడాల్సిన
విజయవాడ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : కరోనా ఎవరిపై ఎప్పుడు వాలుతుందో తెలియదు. మనం జాగ్రత్తలు తీసుకున్నా చుట్టుపక్కల వారి గురించి భయపడాల్సిన పరిస్థితి. ఎంతవరకు సేఫ్గా ఉన్నామో తెలుసుకోడానికి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకున్నా ఎలాంటి రిపోర్టు వస్తుందోనన్న భయం. ఈ పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించి పైపై నివేదికలు ఇస్తున్నాయి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు. వేలాది రూపాయలు వసూలు చేసి నివేదిక సరిగ్గా ఇవ్వకపోవడంతో బాధితులు విజయవాడలోని అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సెంటరులో కొద్దిరోజులుగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం ఐదుగురు శ్వాబ్ను ఇచ్చారు. అదే వ్యక్తులు ప్రభుత్వ ల్యాబ్లోనూ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వారికి పాజిటివ్ వచ్చింది.
అదే వ్యక్తులకు అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్లో మాత్రం నెగెటివ్ రిపోర్టు ఇచ్చారు. తమ నివేదికలు ఇవ్వాలని ఆ బాధితులు మూడు రోజులుగా తిరుగుతున్నారు. రేపు, మాపు అంటూ తిప్పుతున్నారు. బుధవారం గట్టిగా నిలదీయడంతో ఒక కాగితంపై నెగెటివ్ అని రాసి ఇచ్చారు. దీనిపై వారంతా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ ల్యాబ్లో చేసిన పరీక్షలకు పాజిటివ్ అని వచ్చినప్పుడు, ఇక్కడ నెగెటివ్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఒక్కో పరీక్షకు రూ.2,900 వసూలు చేసిన సెంటర్ ప్రతినిధులు రిపోర్టును సరిగ్గా ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు అడిగిన ప్రశ్నలకు డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు పొంతనలేని సమాధానాలు చెప్పారు.
వివాదం పెద్దది కావడంతో అప్పటికప్పుడు పాజిటివ్ రిపోర్టును బాధితుల చేతుల్లో పెట్టారు. సమాచారం తెలుసుకున్న మాచవరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, ఇలా తప్పుడు నివేదికలు ఇస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పినా తర్వాత వెనక్కి తగ్గారు.
Updated Date - 2020-06-18T09:46:08+05:30 IST