పీఎన్బీఎస్లో అణువణువునా స్ర్పే
ABN, First Publish Date - 2020-03-16T10:45:59+05:30
పీఎన్బీఎస్లో అణువణువునా స్ర్పే
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
కరోనా మహమ్మారిపై ఆర్టీసీ దృష్టి సారించింది. ప్రతిరోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే పీఎన్బీఎస్ను కేంద్రంగా చేసుకుని యాంటీ కోవిడ్-19 ఆపరేషన్స్ చేపడుతోంది. ముందస్తుగా అవగాహన, దిద్దుబాటు చర్యల ద్వారానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా ఉంటారన్న ఉద్దేశంతో, యాంటీ కోవిడ్-19 ఆపరేషన్స్ చేపడుతోంది. ఆదివారం బస్స్టేషన్ ఉన్నతాధికారులు స్వయంగా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నారు. పీఎన్బీఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు వచ్చివెళుతుంటాయి. పీఎన్బీఎస్ నుంచి, కృష్ణారీజియన్ డిపోల నుంచి వెళ్లే 250 బస్సులతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులు బస్స్టేషన్లోకి వస్తుంటాయి. ఇంత రద్దీ ఉండే బస్స్టేషన్లో ప్రధానంగా అరైవల్ బ్లాక్పై ఆర్టీసీ అధికారులు దృష్టిసారించారు. ఆదివారం డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (డీసీటీఎం) మూర్తి నేతృత్వంలో ‘యాంటీకోవిడ్ - 19’ వైరస్ ఆపరేషన్స్ చేపట్టారు. ప్రయాణికులు దిగే ప్రదేశం కాబట్టి అరైవల్ బ్లాక్లో అణువణువూ స్ర్పే చేయించారు. ప్లాట్ఫామ్స్, స్టాల్స్, పార్శిల్ కార్యాలయాలు, మరుగుదొడ్లు, క్లోక్ రూమ్లు, ప్రీపెయిడ్ ఆటోస్టాండ్ ్స, క్యాంటీన్స్, నర్సరీలు వేటినీ వదలకుండా స్ర్పే చేయించారు. దీంతో పాటు డిపార్చర్ బ్లాక్లో బుకింగ్ కౌంటర్స్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రయాణికులకు డీసీటీఎం మూర్తి ఈ వైరస్ పట్ల అవగాహన కల్పించారు.
సిబ్బందికి మాస్కులు అందించాలి : ఈయూ
కరోనా వైరస్ పట్ల ఆర్టీసీ కార్మికులు సైతం ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, స్క్వాడ్ టీమ్స్ నుంచి వస్తున్న ఆందోళనలతో కార్మికసంఘాలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వైవీరావు, పలిశెట్టి దామోదరరావు తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్స్ అందించాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి నిర్వహించే బ్రీత్ఎనలైజర్ పరీక్షలను కొద్ది కాలం వాయిదా వేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Updated Date - 2020-03-16T10:45:59+05:30 IST