కష్టకాలంలో ఖాకీల కనికరం
ABN, First Publish Date - 2020-06-03T09:47:13+05:30
కరోనా కష్టకాలంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి..
కృష్ణలంక, మే 2 : కరోనా కష్టకాలంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో ప్రసవ నొప్పులు భరించలేక ఓ మహిళ రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కృష్ణలంక పోలీసులు 108ని పిలిపించి మహిళను, పుట్టిన బిడ్డను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే స్థానిక నెహ్రూనగర్ డొంకరోడ్డు చివరన రణదీవెనగర్ కట్టకింద దాసరి దీపిక భర్త వెంకటరమణతో కలిసి నివాసం ఉంటోంది. దీపికకు నెలలు నిండటంతో మంగళవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
స్థానికులు ఆమెను పరుపుపై పడుకోబెట్టి కట్టకింద నుంచి రోడ్డుపైకి తెచ్చేలోపే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ఆర్ఎంపీ బొడ్డు కత్తిరించగా సమాచారం అందుకున్న సీఐ సత్యానందం, ఎస్ఐ మూర్తి, హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ వెళ్లి రిక్షాపై ఆమెను ఎం హోటల్ వరకు తీసుకొచ్చారు. అనంతరం 108 వాహనం రావటంతో తల్లి, బిడ్డను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమయానికి 108ను రప్పించి తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించిన కృష్ణలంక పోలీసులు, సీఐకు రణదీవెనగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-06-03T09:47:13+05:30 IST