వివాదాస్పదంగా మారిన మైలవరం ఎస్ఐ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-12-05T17:57:09+05:30
జిల్లాలోని మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కృష్ణా: బీజేపీ నేతలతో మైలవరం ఎస్ఐ రాంబాబు చేసిన వ్యాఖ్యలతో జిల్లాలోని మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రహదారులు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ వెల్వడం - నూజివీడు ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రోడ్లు బాగుచేయించవచ్చు కదా అంటూ బీజేపీ నాయకులతో మైలవరం ఎస్ఐ రాంబాబు అన్న వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఎస్ఐ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన బీజేపీ నేతలు ‘‘నువ్వు ఎవరివి ఆ మాటలు చెప్పడానికి’’ అంటూ ఎస్ఐతో బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి బాల కోటేశ్వరరావు, బీజేపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు. ఎస్ఐ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే అక్కడకు చేరుకున్న సీఐ శ్రీను... పరిస్థితిని అదుపు చేసేందుకు బీజేపీ నాయకులతో చర్చలు నిర్వహించారు.
Updated Date - 2020-12-05T17:57:09+05:30 IST