అచ్చోసిన వైసీపీ ఆంబోతులను వదిలేసి.. ఉత్తములైన టీడీపీ నేతలపై అక్రమ కేసులా!
ABN, First Publish Date - 2020-07-12T16:35:22+05:30
అధికార పార్టీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నా..
విజయవాడ(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నా.. వారిపై ఒక్క కేసు నమోదు చేయకుండా ఉత్తములైన టీడీపీ నేతలపై అక్రమకేసులు బనాయించడం దుర్మార్గమని టీడీపీ అధికార ప్రతినిధి, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు అధికారులు అధికార పక్షం చేతిలో కీలు బొమ్మల్లా మారి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
గురజాలలో టీడీపీ కార్యకర్త, దళిత యువకుడు విక్రమ్ను పోలీసులే హత్య చేయించటం దుర్మార్గమన్నారు. విక్రమ్ తల్లి ఆధారాలు చూపించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్టాలు తెలిసిన అధికారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
Updated Date - 2020-07-12T16:35:22+05:30 IST