కాల్వలు కట్టిన కన్నీరు
ABN, First Publish Date - 2020-05-09T09:04:01+05:30
ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు విశాఖ వాసులను అతలాకుతలం చేసేసింది.
గుండెలు బాదుకున్న బంధువులు..
ఇంతటి బాధ ఎవరికీ వద్దని ఆవేదన
కేజీహెచ్ వద్ద మిన్నంటిన రోదనలు..
దాదాపు రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబాలే
ఎల్జీ ఘటనలో మృతులకు పోస్టుమార్టం పూర్తి
మృతుల్లో ఎల్జీ పాలిమర్స్ ఉద్యోగి
విశాఖ(వన్టౌన్), మే 8: విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఘటన.. బాధిత కుటుంబ సభ్యుల కంట కన్నీరు కాల్వలై పారేలా చేసింది. ప్రశాంత జీవితాలను శోకసంద్రంలో ముంచి గుండెలు బాదుకునేలా మార్చింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు శుక్రవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకుని ఆయా మృతుల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. తమవారిని తలుచుకుని పొగిలి పొగిలి కన్నీరు పెట్టారు. ఎటు చూసినా బంధువుల రోదనలతో కేజీహెచ్ కన్నీటిసంద్రంగా మారిపోయింది. వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. తమవారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, ఇక తమ జీవితాలకు దిక్కెవరని, తమ ఆశలు అడియాసలయ్యాయని, ఇంతటి బాధ ఎవరికీ రాకూడదని తీవ్ర ఆవేదన చెందారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. కాగా, గురువారం మృతిచెంది, గుర్తించని వ్యక్తిని ఎస్.గోవిందరాజు(40)గా గుర్తించారు. ఆయన ఎల్జీ పాలిమర్స్లోనే పనిచేస్తున్నారని నిర్ధారించారు. మిగిలినవారిలో గోవిందరాజు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు బద్రీనాథ్(7) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన ఆరేళ్ల చిన్నారి ఎన్.గ్రీష్మ తండ్రి గణేష్ ఆర్టీసీ ఉద్యోగి. కుమార్తె మృతివిషయాన్ని చికిత్స పొందుతున్న భార్య లక్ష్మికి ముందుగా చెప్పలేదు. దీంతో ఆమె మార్చురీ వద్ద గుండెలవిసేలా రోదించారు. నేవల్ ఉద్యోగులైన శ్రీనివాస్, శోభ దంపతుల కుమార్తె జి.కుందనశ్రియ(6) చనిపోగా, కొడుకు శిఖర్(8) చికిత్స పొందుతున్నాడు. మరోమృతుడు ఎన్.నాని(30) రోజు కూలీ. ఆయనకు భార్య లక్ష్మి, బాబు, పాప ఉన్నారు. తాపీ మేస్త్రి అయిన పిట్టా శంకరరావు(46) ఘటనలో ప్రాణాలు కోల్పోగా, అతని భార్య యల్లమ్మ(39), కొడుకు దుర్గాప్రసాద్(15), కూతురు పావని(17) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో మేస్త్రి సీహెచ్ గంగరాజు(44) చనిపోగా భార్య నాగమణి(38), కొడుకు మనో జ్(17), కూతురు రోషిణి(15)చికిత్స పొందుతున్నారు. ఆటో డ్రైవర్ వెంకటరమణ భార్య వరలక్ష్మి(38) ఈ ఘటనలో చనిపోగా, వీరి కుమారుడు చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన నారాయణమ్మ(42) భర్త దివ్యాంగుడు. కూలి పనులు చేసుకునే నారాయణమ్మకు ఇద్దరు కుమార్తెలు. చనిపోయిన అప్పలనర్సమ్మ (45) భర్త పైడిరాజు వంట చేస్తుంటారు. వీరికి ఇద్దరు కొడుకులు. చనిపోయిన మరో వ్యక్తి ఎం.కృష్ణమూర్తి(73) దేవదాయ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు.
అలారం మోగితే బతికేవాడు!.. సత్యనారాయణ, మృతుడు గోవిందరాజు తండ్రి
నా కొడుకు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉన్నాడనుకున్నాను. చనిపోతాడనుకోలేదు. ఎల్జీ పాలిమర్స్లోనే పనిచేసి పదవీ విరమణ చేశాను. నా కొడుకు కూడా అందులోనే పనిచేస్తున్నాడు. ఘటన జరిగినప్పుడు అలారం మోగిఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. కోడలు, మనవడు చికిత్స పొందుతున్నారు.
పుట్టిన రోజు.. చూడకుండానే.. చనిపోయిన కుందనశ్రియ తల్లిదండ్రులు శ్రీనివాస్, శోభ
పుట్టినరోజుకు బట్టలు, కేక్ కొనమంది. ఇంతలోనే దూరతీరాల కు వెళ్లిపోయింది. ముద్దులొలికే మాపాప లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆపస్మారక స్థితిలో మా అబ్బాయి శ్రీకర్ చికిత్స పొందుతున్నాడు. మాకు మరింత ఆందోళనగా ఉంది.
పిల్లల కోసం తపించాడు.. వేణుగోపాల్, మృతుడు శంకరరావు మేనల్లుడు
తాపీ పనిచేస్తూ, పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని తపించేవాడు. మా మామయ్య కొడుకు దుర్గాప్రసాద్ టెన్త్, కూతురు పావని ఇంటర్ చదువుతున్నారు. మా అత్తయ్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2020-05-09T09:04:01+05:30 IST