మందుబాబులకు వందనం.. రాష్ర్టానికి మీరే ఆదాయ వనరు..!
ABN, First Publish Date - 2020-06-02T10:57:08+05:30
వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి..
సత్కరించిన పంతగాని
రైల్వేకోడూరు(కడప): వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మందుబాబులను వైసీపీ విస్మరించిందని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారం రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం పంచాయతీలోని మద్యం దుకాణం వద్ద మందుబాబులకు లుంగీ, టవల్, యాపిల్ పండు ఇచ్చి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చీప్లిక్కర్ రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.200 విక్రయిస్తున్నారని అన్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు కూలీనాలీ చేసుకుని వచ్చిన సంపాదనంతా మద్యానికి తగలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్య నిషేధం చేస్తామని గొప్పలు చెప్పుకుని నేడు ఆదాయం కోసం పిచ్చి పిచ్చి మద్యం విక్రయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తున్న మందుబాబులకు నిజంగా పాదాభివందనం చేయాలన్నారు. ఒక్క చాన్సు ఇవ్వండి అంటూ అధికారం చేపట్టారని.. ప్రస్తుతం ప్రజలకు ఒక్క చాన్సు ఇస్తే వైసీపీని తుదముట్టిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బొక్కసం సునీల్, జూనియర్ ఎన్టీఆర్ యూనియన్ అధ్యక్షుడు కస్తూరి దినేష్, నాయకులు ముద్దపోలు సభాపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-02T10:57:08+05:30 IST