మళ్లీ లాక్ పడింది...పులివెందుల సగం పట్టణంలో ఆంక్షలు
ABN, First Publish Date - 2020-06-29T22:41:06+05:30
పులివెందులలో కరోనా తొలినాళ్ల నాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి అప్పట్లో ప్రభుత్వాలు అమలు చేసిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పట్టణంలో సగానికి పైగా వీధుల్లో జనసంచారం లేదు,
మూతపడిన దుకాణాలు, నిలిచిన వ్యాపారాలు
పులివెందుల టౌన్ (కడప): పులివెందులలో కరోనా తొలినాళ్ల నాటి పరిస్థితి మళ్లీ ఏర్పడింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి అప్పట్లో ప్రభుత్వాలు అమలు చేసిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పట్టణంలో సగానికి పైగా వీధుల్లో జనసంచారం లేదు, వాహనాల రాకపోకలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. గత వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. గత నెల వరకు కేవలం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే లాక్డౌన్ సడలింపు అనంతరం వారం పది రోజులుగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పులివెందులలో పాజిటివ్ కేసుల సంఖ్య సెంచరీ దాటిపోయింది. 103 కేసులు నమోద య్యాయి. దీంతో ఆయా ప్రాంతాలను పూర్తిగా నిర్బంధించారు. పూలంగళ్ల సర్కిల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించారు. ఆదివారం నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి అమ్మకాలను అనుమతించారు. ఇతర దుకాణాలు, వ్యాపారాలు, మెడికల్, వాణిజ్య దుకాణాలను మూసివేయించారు. కొన్ని మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు మాత్రమే పనిచేస్తున్నాయి. పట్టణ రింగురోడ్డు ప్రాంతాలలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటుచేసి రాకపోకలను నియంత్రించగా పట్టణంలో ప్రధాన రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి జనసంచారం, వాహనాల రాకపోకలను అదుపుచేశారు.
Updated Date - 2020-06-29T22:41:06+05:30 IST