సూక్ష్మనీటి సేద్యానికి మోక్షమెప్పుడో?
ABN, First Publish Date - 2020-11-03T10:36:53+05:30
తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సూక్ష్మ నీటి సేద్యంపై రాష్ట్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.
ప్రభుత్వం చిన్నచూపు
25 వేల హెక్టార్లు లక్ష్యం
ఒక్క ఎకరాకూ ఇవ్వని వైనం
(కడప - ఆంధ్రజ్యోతి): తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సూక్ష్మ నీటి సేద్యంపై రాష్ట్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రతిరోజూ మొక్కకు కావాల్సిన నీటిని పైపుల ద్వారా అమర్చిన డ్రిప్లతో బొట్టుబొట్టు నేరుగా మొక్కలకు అందించే విధానాన్ని బిందు సేద్యం, మొక్కవేళ్లకు దగ్గరగా తక్కువ మోతాదులో ఎక్కువ నీటిని చుక్కల రూపంలో అందించడాన్ని సూక్ష్మనీటి సేద్య సాగు అంటారు. ఈ విధానంతో నీటి ఆదాతో పాటు కలుపు నివారణ సులభమవుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి అంతంతమాత్రంగా ఉన్న నీటితోనే జిల్లాలో వ్యవసాయాన్ని కొన్నేళ్లుగా సాగిస్తూ వస్తున్నారు. సూక్ష్మనీటి సేద్యం పండ్ల తోటలకు అత్యంత అనువు కావడంతో ఇటీవల కాలంలో జిల్లాలో డిమాండ్ బాగా ఏర్పడింది. అంతేకాకుండా సాధారణ సాగు చేసిన పంట దిగుబడి కంటే డ్రిప్తో సాగు చేసిన పంటల దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నీటి పొదుపుతో పాటు ఉద్యానపంటలకు అనుకూలంగా ఉండే సూక్ష్మనీటి సేద్యంపై ప్రభుత్వం శీతకన్ను వేయడం పట్ల విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 25 వేల హెక్టార్లలో సూక్ష్మనీటి సేద్యాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రబీ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకు పరికరాలు అందలేదు. 1747 మంది రైతులు గతంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఉద్యాన పంటలకు అనుకూలం
సూక్ష్మనీటి సేద్యం ఉద్యానపంటలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. జిల్లాలో అరటి, మామిడి, జామ, బొప్పాయి, చీనీ, నిమ్మ, దానిమ్మ పంటలు సాగవుతున్నాయి. అలాగే పూలతోటలు కూడా సాగులో ఉన్నాయి. ఉద్యానపంటలు లాభదాయకంగా ఉండడంతో రైతులు వాటి సాగుపై మక్కువ చూపుతున్నారు. అయితే సూక్ష్మనీటి సేద్యం విధానం అయితేనే తక్కువ నీటితో మంచి దిగుబడి సాధించవచ్చు. పురుగు మందులకు అవసరమైన ఎరువులను వీటి ద్వారా నేరుగా మొక్కలకు అందించవచ్చు. అయితే ఇంతవరకు పరికరాలు మంజూరు కాలేదు. గత ఆరేళ్లుగా సూక్ష్మనీటి సాగు పథకాన్ని పరిశీలిస్తే.. 2014-15లో 4411 మంది రైతులకు 4264 హెక్టార్లకు బిందు, తుంపర సేద్యం మంజూరు చేశారు. ఇందుకు గాను 32.54 కోట్లు ఖర్చు చేశారు. 2015-16లో 12,147 మంది రైతులు 13,082 హెక్టార్లలో సూక్ష్మనీటి పరికరాలు అమర్చారు.
రూ.72.63 కోట్లు ఖర్చు చేశారు. 2016-17లో 21,222 మంది రైతులు 25,427 హెక్టార్లకు గాను రూ.13.06 కోట్లు, 2017-18లో 22,149 మంది రైతులు 28,390 హెక్టార్లలో రూ.15.80 కోట్లు, 2018-19లో 25,493 మంది రైతులు 33,903 హెక్టార్లకు రూ.17.02 కోట్లు, 2019-20లో రూ.15.63 కోట్లు ఖర్చు చేసి 16,342 మంది రైతులకు చెందిన 21,370 హెక్టార్లలో బిందు, తుంపర పరికరాలకు ఖర్చు పెట్టి అమర్చారు.
రాయితీపై డైలమా
సూక్ష్మనీటి సేద్యానికి సంబంధించి ఇంతవరకు మార్గదర్శకాలు కానీ, రాయితీపై స్పష్టత లేదు. గతంలో ఐదెకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇచ్చేవారు. ఇతర రైతులు 10 శాతం రైతు వాటాగా చెల్లిస్తే 90 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. రైతుకు రూ.2 లక్షల వరకు రాయితీ లభించేది. పది ఎకరాల్లోపు 90 శాతం, పది ఎకరాల పైన ఉన్న వారికి 50 శాతం రాయితీ ఇచ్చేది. అయితే ఇంతవరకు రాయితీపై స్పష్టత లేదు. జిల్లాలో తొలుత ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికి కేవలం 220 ఎకరాలకు మాత్రమే అనుమతిచ్చారు.
ఆదేశాలు రాగానే మంజూరు చేస్తాం
సూక్ష్మనీటి సేద్యానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ మధుసూధన్రెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు.
Updated Date - 2020-11-03T10:36:53+05:30 IST