నాలుగులేన్ల రోడ్డుకు టెండరు ఖరారు
ABN, First Publish Date - 2020-12-04T05:11:02+05:30
జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగుంట్లలో నిర్మించే నాలుగులేన్ల రోడ్డుకు టెండరు ఖరారు అయింది.
ఎర్రగుంట్ల, డిసెంబరు 3: జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగుంట్లలో నిర్మించే నాలుగులేన్ల రోడ్డుకు టెండరు ఖరారు అయింది. ఆమేరకు ఎన్హెచ్ ఎస్ఈ ద్వారా కడపకు చెందిన శ్రీబాలాజీ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఖరారు చేస్తూ అగ్రిమెంట్ కావాలని సమాచారం పంపినట్లు తెలిసింది. ఇందుకు సంబందించిన అంగీకార పత్రాన్ని విడుదల చేశారు. దీంతో పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చినట్టు అయింది. కడప ఆలంఖాన్పల్లె నుంచి ఎయిర్పోర్టు వరకు 3కిలోమీటర్లు, ఎర్రగుంట్ల నగర పం చాయతీ తూర్పువైపున ఉన్న జువారీ రైల్వే లైన్ నుంచి ఐసీఎల్ కాంపౌండు చివరలో ఉన్న సుంకులమ్మ గుడి వరకు 2.9కిలోమీటర్లు. మొత్తం 5.9కిలోమీటర్లు నాలుగులేన్ల రోడ్డును నిర్మించేందుకు రూ.33కోట్లతో పనులు చేసేందుకు అతి త్వరలో అగ్రిమెంటు అవుతున్నట్లు తెలిసింది. 5.9కిలోమీటర్ల మధ్యలో ఎన్హెచ్ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. ఒకటి రెండు రోజుల్లో మార్కింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డుకు సెంటర్లో 2మీటర్ల డివైడర్, దానికి ఇరువైపులా 8.5మీటర్ల బీటీ రోడ్డు, 1.5గ్రావెల్రోడ్డు, 1.5 మీటర్ల డ్రైనేజి, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ స్తంభాలు వేసేందుకు 1.5మీటర్ల ఖాళీ స్థలాన్ని వదులుతూ నాలుగులేన్ల రోడ్డును డిజైన్ చేశారు. ఎర్రగుంట్లలో నాలుగులేన్ల రోడ్డు వస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-12-04T05:11:02+05:30 IST