దూరం.. దూరంగా..
ABN, First Publish Date - 2020-03-27T09:58:56+05:30
కరోనాను కట్టడి చేయాలి.. మహమ్మాలా విజృంభిస్తున్న వైరస్ను తరిమేయాలి.. అది జరగాలంటే
రోడ్లపై తగ్గిన రద్దీ
ప్రజల్లో చైతన్యం పెంచుతున్న యంత్రాంగం
మున్సిపల్ మైదానంలోకి రాని కూరగాయల వ్యాపారులు
బాధ్యత లేదా..! ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం అంజద్బాషా
నగర వీధుల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం
ఆయా పట్టణాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు
జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు
హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చే వారిపై నిఘా
కడప, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనాను కట్టడి చేయాలి.. మహమ్మాలా విజృంభిస్తున్న వైరస్ను తరిమేయాలి.. అది జరగాలంటే సామాజిక దూరం ఏకైక అస్త్రం.. ఇది మా బాధ్యత అంటూ ప్రజల్లో చైతన్యం పెరిగింది. లాక్డౌన్కు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ‘జనతా కర్ఫ్యూ’ స్ఫూర్తి నింపినా.. లాక్డౌన్ ప్రారంభం తొలి రెండు మూడు రోజులు రోడ్లపై జనం కనిపించారు. ప్రాణాలను హరించే కరోనాను తరిమేయాలంటే కఠిన చర్యలు తప్పవని పోలీస్ యంత్రాంగం భావించింది. బాధ్యత మరిచిన యువతకు పోలీసులు తమదైనశైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. మరో పక్కా వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం ప్రజల్లో చైతన్యం కల్పించారు. దీంతో లాక్డౌన్ నాలుగో రోజైన శుక్రవారం రోడ్లపై రద్దీ తగ్గింది.
తస్మాత్ జాగ్రత..!
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాలే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై కూడా పక్కా నిఘా పెట్టారు. ఓ పక్క ప్రజల్లో చైతన్యం కలిగిస్తూనే.. మరో పక్కా జిల్లాలోకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిపై నిఘా పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ గురువారం నాటికి నాలుగో రోజుకు చేరింది. పోలీసు చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కడప నగరంలో పాత బస్టాండు, సెవెన్రోడ్స్, కోటిరెడ్డిసర్కిల్, వైజంక్షన్, బిల్టప్ ఏరియా, కొత్త బస్టాండు, ఐటీఐ సర్కిల్, సంధ్య సర్కిళ్లు, ప్రధాన రోడ్లలో జనం రద్దీ తగ్గింది.
రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అయితే.. ఆయా ప్రాంతాల్లో కొందరు యువత బాధ్యతను మరి రోడ్లపైకి రావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. గుంజీలు తీయించారు. ఐడీ కార్డులు పరిశీలించి ఉద్యోగులు, ఇతర అత్యవసర సర్వీసుల సిబ్బందిని విధులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యవసర సరకుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు. ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రజలు లాక్డౌన్ పాటిస్తుండడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
సరిహద్దుల్లో చెక్ పోస్టులు
నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు తిరుపతి నగరానికి వెళ్లే జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు పెట్టారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారినే గుర్తించి వారిని హౌస్ ఐసోలేషన్, క్వారంటైన్లో ఉంచి పరిశీలించారు. తాజాగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు.. వంటి నగరాల నుంచి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారు. సరిహద్దు చెక్పోస్టులో రిజిస్టర్ పెట్టి.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నారు. వారి ఆరోగ్యంపై నిఘా పెడుతున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అవసరం అనుకుంటే వారిని కూడా క్వారంటైన్కు తరలించి అబ్జర్వేషన్లో ఉంచుతున్నామని వివరించారు. కడప-నెల్లూరు జిల్లా సరిహద్దు చెక్పోస్టును ఎస్పీ తనిఖీ చేశారు. బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నగరంలో పర్యటించిన డిప్యూటీ సీఎం అంజద్బాషా
డిప్యూటీ సీఎం అంజద్బాషా కడప మండి బజార్లోని పాతకూరగాయల మార్కెట్, మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన విక్రయకేంద్రాలను పరిశీలించారు. కూరగాయ వ్యాపారలు మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టాల్స్లో విక్రయాలకు ముందుకు రాలేదు. కేవలం ఆకుకూరల వ్యాపారులు మాత్రమే వచ్చారు. వ్యాపారుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. కరోనాపై దేశం మొత్తం యుద్ధం చేస్తుంటే మీరు సహకరించరా.! మీకు బాధ్యత ఉండకర్లేదా..! మీ పద్ధతి మార్చుకొని సామాజిక దూరం పాటిస్తూ మున్సిపల్ మైదానంలో కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయండి అని ఆదేశించారు.
నిద్రహారాలు మాని మండుటెండల్లో పోలీసులు మన కోసం పని చేస్తున్నారని, వారి సేవలు మరవలేనివని, అందరూ పోలీసులకు సహకారం అందించాలని కోరారు. మున్పిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టాల్స్కు కూడా కార్పొరేషన్ కాంట్రాక్టర్ సెస్సు వసులు చేస్తున్నారని డిప్యూటీ సీఎంకు పలువురు ఫిర్యాదు చేశారు. సెస్సు మినహాయింపు ఇవ్వాలని కూరగాయల వ్యాపారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాయచోటిలో ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి వీధుల్లో స్కూటీపై పర్యటించి ప్రజల్లో అవగాహన పెంచారు.
ఈ నబంర్లను సంప్రదించండి:
కరోనాపై : కరోనా(కోవిద్-19) కమాండ్ కంట్రోల్ రూమ్ : 08562-245259, 259179
నిత్యవసర సరకులు అధిక ధరలకు విక్రయిస్తే : 08562 - 246344
Updated Date - 2020-03-27T09:58:56+05:30 IST