ఇంటిలోనే చవితి వేడుకలు
ABN, First Publish Date - 2020-08-22T11:43:00+05:30
వినాయకచవితి అంటే ఓ పెద్ద సంబరం. వారం రోజుల ముందునుంచే యువత, వినాయకచవితి కమిటీలు రంగంలోకి దిగుతుంటాయి
అదే క్షేమం.. అదే శుభం
కడప(కల్చరల్), ఆగస్టు 21: వినాయకచవితి అంటే ఓ పెద్ద సంబరం. వారం రోజుల ముందునుంచే యువత, వినాయకచవితి కమిటీలు రంగంలోకి దిగుతుంటాయి. ఎక్కడ విగ్రహాన్ని పెట్టాలి, ఏమేమి చేయాలి, ఎన్నిరోజులు ఉంచాలి.. ఇలాంటివన్నీ చర్చిస్తుంటారు. విగ్రహాన్ని నిలిపాక రోజుకో కార్యక్రమంతో వారంపాటు సందడి చేస్తుంటారు. వినాయకచవితిరోజు ప్రధాన వీఽధులన్నీ కిక్కిరిసిపోతుంటాయి. గణపయ్యలను కొనేందుకు, పూజసామగ్రికోసం జనం పెద్దఎత్తున వస్తుంటారు. ఇదే ఈ ఏడాది ప్రమాదకారి కానుంది. దీంతో వినాయక చవితి పర్వదినాన్ని ఈ ఏడాది ఇంటిలోనే జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా వైరస్ నేపధ్యంలో ఏటా అత్యంత ఘనంగా జరిగే గణపతి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం కావడం యువకులకు నిరాశ కల్గించే అంశమే అయినా అందరి ఆరోగ్యం దృష్ట్యా ఇదే మంచిది. ఊరేగింపులు, విగ్రహాల ఏర్పాట్లు లేవు. చిన్న చిన్న మట్టి గణపతులు ఇంటిలోనే ఏర్పాటు చేసుకొని పండుగ జరుపుకోవడానికే ప్రజలు సిద్ధమయ్యారు. శుక్రవారం కడప నగరంలోని వివిధ కూడళ్లలో మామిడాకులు, అరటి పిలకలు, గణపతికి ఇష్టమైన గరిక, జిల్లేడు, మారేడు, ఎలక్కాయలు, పండ్లు, పూలను ప్రజలు కొనుగోలు చేశారు. కరోనా కష్టాలకు తోడు అధిక ధరలు ప్రజలకు భారమయ్యాయి. గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం 2 గంటల వరకు షాపులకు అనుమతినిచ్చారు.
కనిపించని సందడి
రాజంపేట/రైల్వేకోడూరు: కరోనా నిబంధనల దృష్ట్యా వినాయక చవితి వేడుకల సందడి ఎక్కడా కనబడలేదు. రాజంపేటలో కేవలం చిన్న చిన్న మట్టి విగ్రహాలు, అరటి పిలకలు, మామిడి తోరణాలు, బొజ్జగణపయ్యకు ఇష్టమైన యలక్కాయలు, సొద్దకంకులు, జొన్నకంకులు ఇతరత్రా పూజసామగ్రిని వ్యాపారులు ఏర్పాటు చేశారు. రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనంకూడా కొనేందుకు ఎగబడి రాలేదు. రైల్వేకోడూరులో మట్టివినాయకుల బొమ్మలను మాత్రమే అమ్మకానికి ఉంచారు. ఇక్కడ మాత్రం పూజసామగ్రి తక్కువగా రావడంతో వీటికి విపరీతంగా గిరాకీ ఏర్పడింది.
Updated Date - 2020-08-22T11:43:00+05:30 IST